Begin typing your search above and press return to search.

అమ్మ కోసం వెల‌సిన మ‌రో దేవాల‌యం!

త‌ల‌ప‌తి విజ‌య్ త‌ల్లి కోసం సాయిబాబా గుడి నిర్మించిన‌ట్లు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 April 2024 6:50 AM GMT
అమ్మ కోసం వెల‌సిన మ‌రో దేవాల‌యం!
X

త‌ల‌ప‌తి విజ‌య్ త‌ల్లి కోసం సాయిబాబా గుడి నిర్మించిన‌ట్లు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. చెన్నైలోని ఓ సాయిబాబా ఆల‌యాన్ని విజ‌య్ సంద‌ర్శించ‌డ‌..ఆఫోటోలు లీక్ అవ్వ‌డంతో! ఈ గుడి ఆయ‌న నిర్మించిన గుడి అంటూ ఓ నెటిజ‌నుడు కామెంట్ చేసాడు. అది వైర‌ల్ గా మారింది. విజ‌య్ వైపు నుంచి మీడియాకి సంబంధించి ఎలాంటి అధికారిక స‌మాచారం లేక‌పోవ‌డంతో ఇది వాస్త‌వమా? అవాస్త‌వ‌మా? అన్న దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతుంది.

తాజాగా ఈ ప్ర‌చారంపై విజ‌య్ త‌ల్లి స్పందించారు. గుడి క‌ట్టించిన మాట వాస్త‌వేమ‌న‌ని ఆమె అంగీక‌రించారు. `సాయిబాబా మందిరం నిర్మించాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది. ఈ విషయాన్ని విజయ్‌తో ఎన్నోసార్లు పంచుకున్నా. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని కొంతకాలం క్రితం దీనిని నిర్మించాడు. ప్రతి గురువారం నేను ఇక్కడికి వస్తుంటా. స్వామి వారిని దర్శించుకుంటా. విజయ్‌ కూడా పలు సందర్భాల్లో ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు` అని ఆమె అన్నిర‌కాల ప్ర‌చారాల‌కు పుల్ స్టాప్ పెట్టారు.

త్వ‌ర‌లోనే పేదల కోసం ఇక్కడ ప్రతి రోజూ నిత్యన్న‌దాన కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నామని ఆలయ కమిటీ తెలిపింది. అమ్మ కోసం ఇలా గుడి క‌ట్టించిన న‌టుడిగా విజ‌య్ సెకెండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంత‌కు ముందు రాఘ‌వ‌లారెన్స్ కూడా అమ్మ‌పై ప్రేమ‌తో స్వ‌యంగా ఓ గుడి నిర్మించాడు. త‌మిళ‌నాడులోని అంబత్తూరు లో కొన్నేళ్ల క్రితం లారెన్స్ ఈ గుడి నిర్మించాడు. రాఘవేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోనే ఈ ఆలయ నిర్మాణం జ‌రిగింది.

ఆలయంలో రాజస్థాన్‌లో తయారు చేయించిన 5 అడుగుల పాలరాతి విగ్రహమ‌ది. 13 అడుగుల గాయత్రీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి..ఆ కిందనే లారెన్స్ తల్లి విగ్రహాన్ని ప్ర‌తిష్టాంచారు. అప్ప‌ట్లో ఈ వార్త సంచ‌ల‌నంగా మారింది. అమ్మ కోసం గుడి క‌ట్టించిన ఏకైక న‌టుడిగా లారెన్స్ పేరు వెలిగిపోయింది. ఆ త‌ర్వాత ఆ ఛాన్స్ త‌ల‌ప‌తి తీసుకున్నారు.