Begin typing your search above and press return to search.

ఆ సీనియర్ డైరెక్టర్.. ఈసారి ఉషా పరిణయం..

టాలీవుడ్ సీనియర్ ద‌ర్శ‌కుడు కె. విజ‌య్ భాస్క‌ర్ అంటే ఇప్పుడున్న జనరేషన్ గుర్తుపట్టకపోవచ్చు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 10:15 AM GMT
ఆ సీనియర్ డైరెక్టర్.. ఈసారి ఉషా పరిణయం..
X

టాలీవుడ్ సీనియర్ ద‌ర్శ‌కుడు కె. విజ‌య్ భాస్క‌ర్ అంటే ఇప్పుడున్న జనరేషన్ గుర్తుపట్టకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్ ఇట్టే గుర్తుప‌డతారు. నువ్వే కావాలి, మ‌న్మ‌థుడు, నువ్వు నాకు న‌చ్చావ్, జై చిరంజీవ లాంటి ఆల్‌ టైమ్ ఫ్యామిలీ బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ ల‌ను టాలీవుడ్‌ కు అందించారు విజ‌య్ భాస్క‌ర్. ఇక ఈయ‌న సినిమాల్లోని మూవీ స‌న్నివేశాల‌ను ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ మీమ్స్ కింద వాడేస్తోంది.


అయితే 2013లో రిలీజైన మ‌సాలా మూవీ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మ‌య్యారు విజ‌య్ భాస్క‌ర్. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత జిలేబీ మూవీతో ద‌ర్శ‌కుడిగా రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైనర్ ఉషా ప‌రిణ‌యం మూవీని రూపొందిస్తున్నారు. విజ‌య్‌ భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన కుమారుడు శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తున్నారు.

ఈ సినిమాతో అచ్చ‌ తెలుగ‌మ్మాయి తాన్వీ ఆకాంక్ష హీరోయిన్ గా పరిచయం కానుంది. వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌ లుక్‌ ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన చిత్రీక‌ర‌ణ‌తో టాకీ పార్ట్ పూర్త‌యింద‌ని, త్వ‌ర‌లోనే పాట‌ల షూటింగ్ కు విదేశాల‌కు వెళుతున్నాన‌మని చిత్ర యూనిట్ తెలిపింది. ట్రెడిషనల్ వేర్ లో హీరోహీరోయిన్లు ఆత్మీయంగా దగ్గరకు నిల్చుని ఇచ్చిన రొమాంటిక్ పోజు అదిరిపోయింది. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది. పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది.

జిలేబీ సినిమాతో శ్రీక‌మ‌ల్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శివానీ రాజ‌శేఖ‌ర్ హీరోయిన్‌ గా న‌టించిన ఈ మూవీ 2023 జులైలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ ఫ‌న్ ఎంట‌ర్టైనర్ మూవీ ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని సాధించ‌లేదు. రెండో ప్ర‌య‌త్నంగా ఉషా ప‌రిణ‌యంతో త‌న ల‌క్‌ ను ప‌రీక్షించుకోబోతున్నారు శ్రీక‌మ‌ల్‌. ఇక ఉషా పరిణయం సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహించడంతో పాటు నిర్మాణ‌ బాధ్య‌త‌ల్ని కూడా విజ‌య్ భాస్క‌ర్ చేప‌డుతున్నారు.

ఈ చిత్రంలో వెన్నెల‌ కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ల‌వ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెర‌కెక్క‌తున్న ఈ సినిమాకు ఆర్ ఆర్ ధ్రువ‌న్‌ సంగీతం అందిస్తుండగా.. స‌తీష్ ముత్యాల‌ డీఓపీ, ఎమ్ ఆర్ వ‌ర్మ‌ ఎడిటింగ్‌ బాధ్యతలు చూసుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్.