వివాదంపై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఏమంటున్నాడంటే
సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఆ ఈవెంట్ లో చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారి తీశాయి.
By: Tupaki Desk | 3 May 2025 6:53 AMసూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఆ ఈవెంట్ లో చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. విజయ్ వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ విషయంపై విజయ్ స్పందించి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు.
రెట్రో ఆడియో లాంచ్ కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు కొంతమంది ప్రజల్లో ఆందోళన కలిగించాయని తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై తాను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుపుతూ ఓ నోట్ ను రిలీజ్ చేశాడు విజయ్ దేవరకొండ. ఏ కమ్యూనిటీని, ముఖ్యంగా మన షెడ్యూల్డ్ తెగలను హర్ట్ చేయడం తన టార్గెట్ కాదని, వారిని తానెంతో గౌరవిస్తానని, వారు దేశంలో కీలక భాగంగా భావిస్తానని విజయ్ తెలిపాడు.
తాను కేవలం ఐక్యత గురించి మాత్రమే మాట్లాడానని, దేశం మొత్తం ఒకటేనని, ప్రజలంతా ఒకటేనని, మనమంతా కలిసి ముందుకు ఎలా సాగాలనే దాని గురించే మాట్లాడానని చెప్తున్నాడు విజయ్. ప్రపంచంలో మన దేశం ఒకటిగా నిలబడాలని కోరుకుంటానని, అందరినీ తాను ఫ్యామిలీలాగా, బ్రదర్స్ లాగానే చూస్తానని విజయ్ చెప్పుకొచ్చాడు.
తాను వాడిన ట్రైబ్ అనే పదాన్ని తాను చారిత్రాత్మక డిక్షనరీ కోణంలో మాత్రమే వాడానని, ఎన్నో వందల ఏళ్ల కిందటే మానవ సమాజాన్ని ప్రపంచవ్యాప్తంగా ట్రైబ్స్ గా, వంశాలుగా వ్యవస్థీకరించారని ఇది షెడ్యూల్డ్ తెగల వర్గీకరణను ఎప్పుడూ సూచించలేదని చెప్పిన విజయ్ దేవరకొండ, ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం ట్రైబ్ అంటే అర్థమేంటో కూడా తన నోట్ లో చెప్పాడు.
ఒకవేళ తన మెసేజ్ లో ఏదైనా తప్పు ఉండి, దాని వల్ల ఎవరైనా బాధ పడితే దానికి తాను హృదయపూర్వక క్షమాపణలను తెలియచేస్తున్నట్టు విజయ్ రాసుకొచ్చాడు. శాంతి, ఐక్యత గురించి మాట్లాడటమే తన లక్ష్యమని, అందరూ ఐక్యంగా ఉండి కలిసిగట్టుగా ఉండాలనేదే తన ఉద్దేశమని, విడగొట్టడం తన ఉద్దేశం కాదని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు.