చనిపోయిన పాత్రపై బుర్ర తక్కువ ప్రశ్న!
ఇదే విషయాన్ని ముంబై మీడియా వాణీ కపూర్ ని ప్రశ్నించింది. వార్ లో నటించినప్పుడు `వార్ 2`లో ఎందుకు భాగం కాలేదు? అని మీడియా ప్రశ్నించింది.
By: Tupaki Desk | 25 July 2025 8:15 AM ISTబాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ `ఆహా కళ్యాణం` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైంది. నేచురల్ స్టార్ నాని సరసన నటించిన ఈ రీమేక్ చిత్రం పెద్ద డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత వాణీ మళ్లీ తెలుగులో కనిపించలేదు. అలాగే యష్ రాజ్ ఫిలింస్ నిర్మించే సినిమాల్లో మాత్రమే ఈ భామ పదే పదే కనిపించడంపైనా చాలా రూమర్లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన భారీ యాక్షన్ చిత్రం `వార్`లో ఈ లక్కీగాళ్ అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ సరసన వాణీ కపూర్ నటించింది. ఇందులో గ్లామర్ డాళ్ గా కనిపించినా కానీ, తన పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో ఆ తర్వాత నటిగా వరుస అవకాశాలు అందుకుంది. అయితే హృతిక్, ఎన్టీఆర్ నటిస్తున్న సీక్వెల్ చిత్రం వార్ 2లో మాత్రం వాణీ నటించడం లేదు.
ఇదే విషయాన్ని ముంబై మీడియా వాణీ కపూర్ ని ప్రశ్నించింది. వార్ లో నటించినప్పుడు `వార్ 2`లో ఎందుకు భాగం కాలేదు? అని మీడియా ప్రశ్నించింది. అయితే తనను ఎంపిక చేయకపోవడంపై నిర్మాతలపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని వాణి వెల్లడించారు. ఈ చిత్రంలో భాగం కావాలనుకున్నారా? అని ప్రశ్నించగా, దానిని వాణీ తోసిపుచ్చింది. పైగా వార్ 2 నటీనటులు, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపింది. వార్ లో నటించే అవకాశం కల్పించినందుకు ఆదిత్య చోప్రాకు కూడా ధన్యవాదాలు చెప్పిన వాణీ ఆ పాత్ర ఆఫర్ చేసినందుకు చాలా కృతజ్ఞురాలిని అని అంది. ``నా పాత్ర చాలా అందమైనది.. సినిమాటిక్ గా .. లార్జర్ దేన్ లైఫ్ పాత్ర కంటే పెద్దది. చిత్ర బృందానికి ధన్యవాదాలు... అని వాణీ అన్నారు.
అయితే వార్ చిత్రంలో టైగర్ పాత్రతో పాటు తన పాత్ర కూడా చనిపోయిన విషయాన్ని మీడియాకు గుర్తు చేసింది వాణీ. ``నేను, సిడ్ (దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్), టైగర్ .. మేమంతా సీక్వెల్ లో లేము. టైగర్ , నేను ఇద్దరూ వార్ లో చనిపోయాము. కాబట్టి నేను, టైగర్ తిరిగి వస్తే ఎలా? అని ప్రశ్నించింది. టైగర్ తిరిగి వస్తే నేను కూడా వస్తాను! అని పేర్కొంది. అందుకే వాణీని కానీ, టైగర్ ని కానీ `వార్ 2`లో ఎందుకు నటించలేదు? అని ప్రశ్నించడం సరికాదు. ఇది చెత్త ప్రశ్న. చనిపోయిన పాత్రలను తిరిగి బతికించడం అనేది కేవలం ఫిక్షనల్ అవుతుంది. అది నిజానికి సాధ్యపడనిది. మొదట వాణీని ఈ ప్రశ్న అడగటమే రాంగ్. కానీ హిందీ మీడియా యథాలాపంగా ఈ ప్రశ్న అడిగింది. వార్ 2లో నటించకపోయినా వాణీ కపూర్ తదుపరి `మందల మర్డర్స్` అనే థ్రిల్లర్లో నటించింది. ఇది వాణీకపూర్ కి ఓటీటీ ఆరంగేట్రం. ఆగస్టు 14న వార్ 2 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో కియరా అద్వాణీ కథానాయికగా నటించింది.
