Begin typing your search above and press return to search.

టాలీవుడ్.. కథలు కథలుగా చెప్పాలని..

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నటించిన స‌లార్‌ కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు ఇప్పటికే మేక‌ర్స్ అనౌన్స్ చేశారు

By:  Tupaki Desk   |   5 Oct 2023 6:00 AM GMT
టాలీవుడ్.. కథలు కథలుగా చెప్పాలని..
X

ప్రస్తుతం ఓ కథను రెండు భాగాలుగా చెప్పడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు దర్శకనిర్మాతలు. పాన్‌ ఇండియా సినిమాలన్నీ చాలా వరకు రెండు భాగాలుగానే ప్రేక్షకుల ముందుకొస్తూ అలరిస్తున్నాయి. మొదటి భాగం కథతో ఆసక్తిని రేకెత్తించి, రెండో భాగం కోసం ఆత్రుతగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. అయితే తాజాగా ఆ జాబితాలో ఎన్టీఆర్ దేవర కూడా చేరిన సంగతి తెలిసిందే.

అయితే ఇలా రెండు భాగాలుగా కథలు చెప్పడమనే ట్రెండ్ మొదలైంది బాహుబలితోనే. ఆ తర్వాత కేజీయఫ్ కూడా అదే బాటను ఫాలో అయి కమర్షియల్ గా బిగ్ సక్సెస్​ను అందుకుంది. ఇంకా ఈ బాటలో ఇప్పుడు చాలానే చిత్రాలు తెరకెక్కుతున్నాయి. పుష్ప మొదటి భాగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. రెండో భాగం కోసం ఆత్రుతగా ఎదురుచూసేలా చేసింది. ఇది మేకింగ్ దశలో ఉంది.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నటించిన స‌లార్‌ కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు ఇప్పటికే మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. మొదటి భాగాన్ని సీజ్‌ఫైర్ పేరుతో ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు. ప్ర‌భాస్ నటిస్తున్న మరో చిత్రం క‌ల్కి కూడా రెండు లేదా మూడు భాగాలుగా రావొచ్చ‌న్న మాటలు వినిపిస్తున్నాయి.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ క‌ళ్యాణ్ నటిస్తున్న సినిమాలు కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే ఆలోచ‌న‌తో మేక‌ర్స్ ఉన్నార‌ని తెలుస్తోంది. వీటిలో గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఎంటర్​టైనర్​ ఓజీ ఒక‌టి కాగా.. మరోకటి హిస్టారికల్ డ్రామా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. ఈ రెండు చిత్రాలను రెండు భాగాలుగానే తీసుకొస్తారని అంటున్నారు.

ఇక గౌత‌మ్ తిన్న‌నూరి - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబో సినిమా కూడా రెండు భాగాలుగా రానుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాలే కాకుండా.. టాలీవుడ్​లో ప్రస్తుతం మరిన్ని సీక్వెల్స్ కూడా తెరకెక్కుతున్నాయి. టిల్లు స్క్వేర్​, గూఢ‌చారి 2, డబుల్ ఇస్మార్ట్ సినిమాల‌ కూడా సీక్వెల్స్​గానే రాబోతున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇంకా అఖండ‌, స్కంద వంటి సినిమాల‌కు కూడా సీక్వెల్స్ ఉన్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.