Begin typing your search above and press return to search.

ఆ కథ చిరు కోసం రాసిందే.. కానీ ట్విస్ట్ ఏమిటంటే..

ఆ తర్వాత తన చేతిలో ఉన్న మరో రెండు మూడు క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించనున్నారు.

By:  Tupaki Desk   |   18 March 2024 4:50 PM GMT
ఆ కథ చిరు కోసం రాసిందే.. కానీ ట్విస్ట్ ఏమిటంటే..
X

టాలీవుడ్ యువ కథానాయకుడు సందీప్ కిషన్.. ఇటీవల ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మంచి హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ మూవీ సెట్స్ పై ఉండగానే మరిన్ని సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం మాయవన్-2 షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత తన చేతిలో ఉన్న మరో రెండు మూడు క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించనున్నారు.

కొద్ది రోజుల క్రితం సందీప్ కిషన్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం సంగతి తెలిసిందే. ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన- సందీప్ కాంబోలో మూవీ తెరకెక్కనున్నట్లు ప్రకటన వచ్చింది. బెజవాడ ప్రసన్న కుమార్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. అయితే ఈ స్టోరీతో గతంలో కళ్యాణ్ కృష్ణ.. చిరంజీవితో సినిమా తెరకెక్కించాలనుకున్నారని, ఆ కథే ఇప్పుడు సందీప్ కిషన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ విషయంపై SK 30 నిర్మాత రాజేష్ దండా స్పందించారు. తన బర్త్ డే సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. సోషల్ మీడియాలో వస్తున్న టాక్ నిజమేనా అని అడగ్గా.. ఆయన సమాధానమిచ్చారు. వాస్తవానికి ఇదే స్టోరీ లైన్.. ప్రసన్నకుమార్.. కళ్యాణ్ కృష్ణ, చిరంజీవి దగ్గర వినిపించారని చెప్పారు. కానీ తాము దానికి డిఫరెంట్ వెర్షన్ లో సినిమా తీస్తున్నామని తెలిపారు. ఆ మూవీకి SK 30 చాలా తేడాలుంటాయని వెల్లడించారు.

తమ ప్రాజెక్టు ఈ ఏడాది మేలో మొదలు పెడతామని తెలిపారు రాజేష్ దండా. డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యామని చెప్పారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. ప్రమోషన్లు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ప్రసన్న, త్రినాథరావు నక్కిన కలిసి కథలో కీలక మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇక రాజేష్ దండా.. అల్లరి నరేష్ తో బచ్చల మల్లి సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఈ సినిమా తర్వాత సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరంతో చిత్రాలు చేయనున్నారు. వచ్చే ఏడాదిలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు తెలిపారు రాజేష్. మరి ఆయన తన కొత్త సినిమాలతో మంచి హిట్లు కొడతారో లేదో చూడాలి.