Begin typing your search above and press return to search.

'జై శ్రీరామ్'.. బీచ్ ఒడ్డున తండేల్ టీమ్ సెలబ్రేషన్స్

అయితే అక్కనేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ మూవీ టీమ్.. షూటింగ్ సెట్స్ లో అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకలను జరుపుకుంది.

By:  Tupaki Desk   |   22 Jan 2024 12:56 PM GMT
జై శ్రీరామ్.. బీచ్ ఒడ్డున తండేల్ టీమ్ సెలబ్రేషన్స్
X

కోట్లాది మంది భక్తుల కల సాకారమై అయోధ్య కొత్త ఆలయంలోకి బాలరాముడు వచ్చేశాడు. సోమవారం మధ్యాహ్నం దివ్యమైన ముహూర్తంలో అభిజిత్‌ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రాణప్రతిష్ఠ ఉత్సవం గ్రాండ్ గా జరిగింది. ఈ అపురూప ఘట్టాన్ని చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ సహా అనేక మంది సినీ ప్రముఖులు కనులారా వీక్షించారు.

అభిషేక్‌ బచ్చన్‌, కంగనా రనౌత్, అలియా భట్-రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ దంపతులు కూడా ఈ పుణ్య ఘట్టానికి హాజరయ్యారు. హేమ మాలిని, శంకర్ మహదేవన్, మధుర్ భండార్కర్, సుభాష్ ఘయ్, షెఫాలీ షా, విపుల్ షా, రణదీప్ హుడా, లిన్ లైష్రామ్, ఆదినాథ్ మంగేష్కర్, అను మాలిక్, సోనూ నిగమ్ సహా పలువురు సెలబ్రిటీలు శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే అక్కనేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ మూవీ టీమ్.. షూటింగ్ సెట్స్ లో అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకలను జరుపుకుంది. సముద్రం ఒడ్డున జై శ్రీరామ్ అంటూ ఇసుకతో సైకత శిల్పం తయారు చేసింది. ఆ శిల్పం చుట్టూ నిల్చున్న మూవీ టీమ్.. జెండాలు పట్టుకుని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసింది. అందుకు సంబంధించిన డ్రోన్ వీడియోను చిత్రయూనిట్ షేర్ చేసింది. ప్రతి భారతీయుడి హృదయంలో ప్రతిధ్వనించే శ్లోకం- జై శ్రీ రామ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కార్తికేయ, కార్తికేయ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తుండంతో మరింత బజ్ నెలకొంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ కట్టిన తండేల్ మూవీని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు 2018 నవంబర్‌లో గుజరాత్‌లో సముద్రంలో చేపల వేటకు వెళ్లినప్పుడు పాకిస్తాన్ దళాలు తీసుకెళ్లి జైల్లో బంధిస్తాయి. ఆ తర్వాత వారిని విడిపించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది. చివరికి 2020 జనవరిలో ఆ మత్స్యకారులను పాకిస్తాన్ విడుదల చేసింది. ఈ ఘటనల నేపథ్యంలోనే తండేల్ సినిమా తెరకెక్కుతోంది. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.