Begin typing your search above and press return to search.

త‌లైవ‌ర్ 171.. కాలంతో ఆడుకునేవాడు!

తాజాగా టీజ‌ర్ గురించి వెల్ల‌డిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో మాస్ అవ‌తార్ లో క‌నిపించిన‌ రజనీకాంత్ చేతికి సంకెళ్లులా వేసిన వాచీలు ఆస‌క్తిని పెంచాయి.

By:  Tupaki Desk   |   28 March 2024 6:26 PM GMT
త‌లైవ‌ర్ 171.. కాలంతో ఆడుకునేవాడు!
X

సౌతిండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా వెలిగిపోతున్నాడు లోకేష్ క‌న‌గ‌రాజ్. అత‌డు తెర‌కెక్కించిన సినిమాల‌న్నీ బంప‌ర్ హిట్లు కావ‌డంతో అతడికి మార్కెట్లో డిమాండ్ అమాంతం పెరిగింది. విజ‌య్ తో తెర‌కెక్కించిన‌ 'లియో'కి టాక్ తో సంబంధం లేకుండా క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అదంతా అటుంచితే, లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌దుప‌రి చిత్రం గురించి చాలా కాలంగా అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది.

డిసెంబర్ 2023లో సూపర్ స్టార్ రజనీకాంత్ న‌టించే 'తలైవర్ 171' పై పూర్తిగా దృష్టి పెట్టడానికి సోషల్ మీడియా నుండి విరామం తీసుకుంటున్నాన‌ని లోకేష్ ప్ర‌క‌టించాడు. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో అత‌డు బిజీ అయ్యాడు. సినిమా ప్రోగ్రెస్‌కి సంబంధించి రకరకాల రిపోర్ట్‌లు వ‌చ్చాయి. మేకర్స్ ఇప్ప‌టికి టైటిల్ టీజర్‌ను ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తామ‌ని ప్రకటించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'తలైవర్ 171'కి అనిరుధ్ సంగీతం అందించగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. అత‌డే ర‌చ‌యిత కూడా.

తాజాగా టీజ‌ర్ గురించి వెల్ల‌డిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో మాస్ అవ‌తార్ లో క‌నిపించిన‌ రజనీకాంత్ చేతికి సంకెళ్లులా వేసిన వాచీలు ఆస‌క్తిని పెంచాయి. రిస్ట్ వాచీలను చైన్ లాగా చుట్టుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మెకానికల్ వాచ్ భారీగా క‌నిపిస్తోంది. ఈ లుక్ తోనే చాలా వ‌ర‌కూ లోకేష్ ఎంపిక చేసుకున్న క‌థేంటో రివీలైంది. కాలంతో ప‌రుగు నేప‌థ్యంలో సాగే మ‌రో ఆస‌క్తిక‌ర సినిమా ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. క‌థానుసారం కాలానికి వ్యతిరేకంగా వెళ్లేవాడిగా ఇందులో ర‌జ‌నీ న‌టిస్తున్నాడ‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ చిత్రం జనవరి లేదా సమ్మర్ 2025 నాటికి వెండితెరపైకి వచ్చే అవకాశం ఉంది. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రం తన LCUలో భాగం కాదని, స్వతంత్ర చిత్రంగా ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, జూన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని తెలిపాడు.

మ‌న‌వ‌రాళ్ల‌తో ఆడుకోవాల్సిన వ‌య‌సులో!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వ‌య‌సు 73. మ‌న‌వ‌లు మ‌న‌వ‌రాళ్ల‌తో ఆట‌లాడుకునే వ‌య‌సు. కానీ ఇంకా ఆయ‌న మునుప‌టి ఎన‌ర్జీతోనే ప‌ని చేస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. త‌లైవార్ 171 లుక్ రిలీజ్ కాగానే ఇది నిజంగా బాషా డేస్ ని గుర్తు చేసింద‌ని అభిమానులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అంత స్టైలిష్ గా ఈ లుక్ క‌నిపిస్తోంది. ఆస‌క్తిక‌రంగా ఇటీవ‌ల హోలీలో ర‌జ‌నీకాంత్ త‌న మ‌న‌వరాళ్లు మ‌న‌వ‌ళ్ల‌తో క‌లిసి ఆట‌లాడుకుంటున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ర‌జ‌నీ తన భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యతో పాటు తన మనవరాళ్లతో కలిసి స్పెష‌ల్ డేని సెల‌బ్రేట్ చేసుకున్నారు. వేదికపై అతని కుమార్తెలు ఇద్దరూ బోలెడంత సంద‌డి చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ హోలీ ఎందుకు ప్రత్యేకమైనదో కూడా ర‌జ‌నీ కుమార్తెలు వెల్లడించారు.

అలాగే హోలీ పండుగ వేళ సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ త‌న కుమారులు వేద్, వీర్‌లను పట్టుకుని కనిపించారు.

త‌న తండ్రి శివాజీ రావు గైక్వాడ్ నుండి మెగాస్టార్ రజనీకాంత్‌గా పేరు మార్చుకున్న రోజు కూడా ఇదేన‌ని ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ వెల్ల‌డించారు. ఈసారి హోలీ వేడుకలు ప్రత్యేకమైనవని వెల్లడించారు.

రజనీకాంత్ వ‌రుస పెట్టి..

ఈ ఏడాది ర‌జ‌నీ కాంత్ వ‌రుస చిత్రాల‌తో బిజీ కానున్నారు. ప్రస్తుతం జై భీమ్ దర్శకుడు T.J జ్ఞానవేల్‌తో తన తదుపరి చిత్రం 'వేట్టైయన్' షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. 2024లో విడుదల చేయాలని భావిస్తున్నారు. వేట్టైయన్‌లో ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, అమితాబ్ బచ్చన్ త‌దితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'జైలర్ 2' చేయ‌డానికి ఆస్కారం ఉంది. జ్ఞాన‌వేల్ టిజే, లోకేష్ కన‌గ‌రాజ్ చిత్రాల త‌ర్వాత నెల్స‌న్ కి ఛాన్సుంటుందని భావిస్తున్నారు.