ప్రభాస్ ఇంటి ముందు 'రాజాసాబ్' నిర్మాత...!
ప్రభాస్లో మరోసారి బుజ్జిగాడిని చూపించబోతున్నట్లు మారుతి ప్రకటించిన నేపథ్యంలో అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ లో ప్రభాస్ను చూసి పిచ్చెక్కి పోతున్న ఫ్యాన్స్ ఉన్నారు.
By: Tupaki Desk | 18 Jun 2025 6:04 AMపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాజాసాబ్' సినిమాతో పాటు 'ఫౌజీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రాజాసాబ్ నుంచి ఇటీవల వచ్చిన టీజర్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఈమధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతూ, హిట్ ఫార్ములాగా నిలిచిన హర్రర్ కామెడీ కాన్సెప్ట్తో ఈ సినిమా రాబోతుంది. రాజాసాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తో పాటు ఇంకా పలువురు ప్రముఖ స్టార్స్ ఈ సినిమాలో ఉండటంతో పాటు, ప్రభాస్లో మరోసారి బుజ్జిగాడిని చూపించబోతున్నట్లు మారుతి ప్రకటించిన నేపథ్యంలో అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ లో ప్రభాస్ను చూసి పిచ్చెక్కి పోతున్న ఫ్యాన్స్ ఉన్నారు.
ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'రాజాసాబ్' సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం కన్ఫర్మ్. ఈ సినిమాతో నిర్మాత టీ జీ విశ్వప్రసాద్ భారీ లాభాలను సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీ జీ విశ్వ ప్రసాద్ గత ఏడాది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్గా నిలిచి భారీ నష్టాన్ని మిగిల్చింది. దాంతో ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే టాక్ వచ్చింది. కానీ ఆయన పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. వేల కోట్ల ఆస్తులు ఉన్న ఆయనకు చిన్న నష్టాలు పెద్దగా ఇబ్బంది పెట్టవని ఆయన సన్నిహితులు అంటున్నారు.
టీ జీ విశ్వప్రసాద్ తాజాగా జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి గుడి వద్ద అత్యంత ఖరీదైన ప్లాట్ ఒకటి కొనుగోలు చేశాడట. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ఏరియాల్లో జూబ్లీహిల్స్ ఒకటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది సెలబ్రిటీలు ఆ ప్రాంతంలో ఉంటారు. అక్కడే రెబల్ స్టార్ ప్రభాస్ ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి సరిగ్గా ఎదురుగా ఉన్న ప్లాట్ ను రాజాసాబ్ నిర్మాత విశ్వప్రసాద్ కొనుగోలు చేశాడట. దాదాపుగా రూ.50 కోట్లు ఖర్చు చేసి ఆ ప్లాట్ కొనుగోలు చేశాడని, అతి త్వరలోనే ఇంటిని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రభాస్ తో సినిమాను నిర్మించిన విశ్వప్రసాద్ ఏకంగా ఆయన ఇంటి ముందు ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టి మరింతగా ప్రభాస్కి క్లోజ్ కాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో రాజాసాబ్తో పాటు మరికొన్ని సినిమాలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి జోరు కాస్త తగ్గిందని చెప్పాలి. అయితే ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు లేవు. వరుస ఫ్లాప్స్ నేపథ్యంలో కాస్త జాగ్రత్త పడుతున్నారు. అంతే కాకుండా ఒకేసారి రెండు పెద్ద సినిమాలు చేస్తున్న నేపథ్యంలో చిన్న సినిమాలపై ఫోకస్ తగ్గించి ఉంటారని తెలుస్తోంది. రాజాసాబ్తో పాటు ఇదే ఏడాది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో రూపొందుతున్న మరో ప్రతిష్టాత్మక మూవీ మిరాయ్ విడుదల కాబోతుంది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ ఒక సూపర్ హీరో కాన్సెప్ట్తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్తో ఒక సినిమా కోసం వీరు ప్రయత్నాలు చేస్తున్నారు.