Begin typing your search above and press return to search.

ఆలస్యం అయినా ఆసక్తిని పెంచుతున్నాయి...!

సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్‌ మరియు హనుమాన్ సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   18 Jan 2024 6:15 AM GMT
ఆలస్యం అయినా ఆసక్తిని పెంచుతున్నాయి...!
X

సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్‌ మరియు హనుమాన్ సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నాలుగు సినిమాలతో పాటు తమిళ స్టార్ హీరోలు నటించిన రెండు సినిమాలు కూడా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ థియేటర్ల సమస్య కారణంగా ఆ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి.

తమిళనాట సంక్రాంతి సందర్భంగానే విడుదల అయిన ధనుష్ 'కెప్టెన్‌ మిల్లర్‌' మరియు శివ కార్తికేయన్‌ 'అయలాన్‌' సినిమాలు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వీరిద్దరికి కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది కనుక ఈ రెండు సినిమాలు ఆలస్యం అయినా కూడా ఆసక్తి పెంచుతున్నాయి.

ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా అయలాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినట్లు తమిళ మీడియా వర్గాల్లో కథనాలు వచ్చాయి. కనుక తెలుగు ప్రేక్షకులు కూడా రెండు డబ్బింగ్‌ సినిమాలను ఆధరిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

జనవరి 25వ తారీకు కెప్టెన్ మిల్లర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు ధనుష్ రాబోతున్నాడు. ఆ తర్వాత రోజే అంటే జనవరి 26న అయలాన్ సినిమా తో శివ కార్తికేయన్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మొత్తానికి ఒక్క రోజు గ్యాప్ తో సోలో రిలీజ్ అవ్వబోతున్న ఈ రెండు డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏమేరకు ప్రభావం చూపిస్తాయి అనేది చూడాలి.

వచ్చే వారంలో ఈ రెండు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. సంక్రాంతికి విడుదల అయిన నాలుగు సినిమాల జోరు కూడా అప్పటి వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. హనుమాన్ కి ఒక మోస్తరుగా వసూళ్లు నమోదు అయినా కూడా ఆ రెండు సినిమాలకు వచ్చే నష్టం ఏమీ ఉండదు అని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంటే మాత్రం కచ్చితంగా డబ్బింగ్ సినిమాలైనా కూడా పోటీ లేకపోవడంతో సాలిడ్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. మరి ధనుష్ మరియు శివ కార్తికేయన్‌ లు అలాంటి విజయాన్ని సొంతం చేసుకునేనా చూడాలి.