సూర్య-వెంకీ మూవీ షూటింగ్కి ముందు ఇలా..!
తాజాగా ఈ సినిమా మేకర్స్ పళని మురుగన్ ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.
By: Tupaki Desk | 5 Jun 2025 1:30 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత ఏడాది కంగువా, ఈ ఏడాది రెట్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. ముఖ్యంగా కంగువా సినిమా ఆ ఏడాదిలోనే కాకుండా కోలీవుడ్లో అతి పెద్ద డిజాస్టర్స్ జాబితాలో నిలిచింది. కంగువా సినిమా విడుదల సమయంలో సూర్య ఎదుర్కొన్న విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగువా సినిమా ఫ్లాప్ మరవక ముందే సూర్యకు రెట్రో రూపంలో మరో దెబ్బ తగిలింది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చినప్పటికీ రెట్రో సినిమాను ప్రేక్షకులు ఆధరించలేదు. అన్ని భాషల్లోనూ రెట్రో విఫలం అయింది.
ప్రస్తుతం సూర్య రెండు సినిమాలను చేస్తున్నాడు. తమిళ దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. ఇదే ఏడాది సూర్య 45 సినిమా విడుదల కానుంది. ఎస్ ఆర్ ప్రభు ఆ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే సూర్య కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. ఆ సినిమాకు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. వెంకీ అట్లూరి బ్యాక్ టు బ్యాక్ సర్, లక్కీ భాస్కర్ సినిమాలతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈయన దర్శకత్వంలో రాబోతున్న సూర్య 46 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గతంలోనే జరిగిన విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమా మేకర్స్ పళని మురుగన్ ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. షూటింగ్ ప్రారంభంకు ముందు పళని మురుగన్ను దర్శించుకున్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన వారిలో హీరో సూర్యతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగ వంశీ ఉన్నారు. వీరితో పాటు మరికొందరు చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. వెంకీ తమిళ హీరో ధనుష్ తో చేసిన సర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తమిళనాట కూడా సూర్య-వెంకీ-వంశీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
లక్కీ భాస్కర్ సినిమాతో దుల్కర్ సల్మాన్ కి వెంకీ అట్లూరి భారీ విజయాన్ని అందించాడు. అందుకే ఈ సినిమా విషయంలో చాలా నమ్మకం ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. జూన్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మమిత బైజును హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా కోసం తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమా విజయం సాధిస్తే వెంకీ అట్లూరి ఇతర భాషల హీరోకు మరింతగా మోస్ట్ వాంటెడ్ హీరోగా మారే అవకాశాలు ఉన్నాయి.
