Begin typing your search above and press return to search.

జాట్‌ : మైత్రి, పీపుల్స్‌ వాళ్లు సేఫేనా?

తాజాగా తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ 'జాట్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   11 April 2025 5:40 AM
Sunny Deol’s Jatt Opens Poorly
X

సౌత్ హీరోలు, దర్శకులు మాత్రమే కాకుండా నిర్మాణ సంస్థలు సైతం బాలీవుడ్‌ బాట పట్టాయి. ఆ మధ్య దిల్‌ రాజు బాలీవుడ్‌లో సినిమాను నిర్మించాడు. తాజాగా తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ 'జాట్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్‌, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్‌, నవీన్ యెర్నేని, రవి శంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ సన్నీ డియోల్‌ హీరోగా నటించిన ఈ సినిమాను నిర్మాతలు దాదాపుగా రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం. తాజాగా విడుదలైన ఈ సినిమా పూర్‌ ఓపెనింగ్‌ నమోదు చేయడంతో నిర్మాతలు సేఫేనా అనే చర్చ మొదలైంది.

'గదర్‌ 2' సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో పాటు భారీ వసూళ్లు నమోదు చేయడంతో సన్నీ డియోల్‌ ఈ సినిమాకు ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం అందుకున్నాడని సమాచారం అందుతోంది. గదర్‌ 2 సినిమాకు గాను రూ.20 కోట్ల లోపు పారితోషికం తీసుకున్న సన్నీ డియోల్‌ 'జాట్‌' కోసం కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం అందుకున్నాడు. సినిమా మొత్తం బడ్జెట్‌లో 50 శాతం హీరో పారితోషికంకి ఖర్చు చేసినట్లు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సన్నీ డియోల్‌ వంటి సీనియర్‌ హీరోకు ఆ స్థాయి పారితోషికం అనేది రిస్క్‌తో కూడుకున్న పని. కానీ ఆయన గత చిత్రం ఫలితం కారణంగా మేకర్స్‌ ఆ స్థాయి పారితోషికంను ఇవ్వక తప్పలేదు అనేది టాక్‌.

సినిమా విడుదలకు ముందు థియేట్రికల్‌ రైట్స్‌, ఇతర రైట్స్ ద్వారా దాదాపు రూ.85 కోట్లను నిర్మాతలకు వెనక్కి తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా వసూళ్లు సాధించి లాభాలు తెచ్చి పెడితే అప్పుడు నిర్మాతలకు బ్రేక్ ఈవెన్‌ అయ్యే అవకాశం ఉంది. కానీ మొదటి రోజు కేవలం రూ.10 కోట్లు(అంచనా) నమోదు చేసిందని సమాచారం. వంద కోట్ల టార్గెట్‌ అంటూ విడుదలైన జాట్‌ ఫస్ట్‌ డే 10 కోట్లు రాబడితే లాంగ్‌ రన్‌లో ఏ మేరకు సాధిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈమధ్య కాలంలో ఓపెనింగ్‌ కలెక్షన్స్ వందల కోట్లు నమోదు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో జాట్ కేవలం రూ.10 కోట్లు రాబట్టిందంటే కచ్చితంగా లాంగ్ రన్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

నిర్మాతలు ముందస్తుగానే రూ.85 కోట్ల బిజినెస్ చేసిన నేపథ్యంలో సాధ్యం రిస్క్‌ ఎక్కువగా ఉండక పోవచ్చు. భారీ లాభాలు దక్కడం సాధ్యం కాదు, అలా అని నష్టాలు కూడా భారీగా ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సినిమాకు సంబంధించిన ఇంకా కొన్ని హక్కులు నిర్మాతల వద్ద ఉంటాయి. వాటిని అమ్మడం ద్వారా పెట్టుబడి వరకు వెనక్కి రావడం పెద్ద కష్టం ఏమీ కాదు అనేది సినీ విశ్లేషకుల మాట. అసలు విషయం ఏంటి అనేది ఆ నిర్మాతలు చెప్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

తెలుగులో బాలకృష్ణతో వీర సింహారెడ్డి సినిమాను తీసిన గోపీచంద్ మలినేని ఆ తర్వాత ఈ సినిమాను తెలుగులో రవితేజతో తీయాలని భావించాడు. కానీ బడ్జెట్‌ ఇష్యూ కారణంగా హిందీలో చేశారు. బాలీవుడ్‌లోనూ రూ.75 కోట్ల లోపు బడ్జెట్‌తో పూర్తి చేసి ఉంటే నిర్మాతలకు లాభాలు ఎక్కువగానే ఉండేవి. కానీ సన్నీ డియోల్‌ మార్కెట్‌ను మించి బడ్జెట్‌ ఖర్చు చేయడంతో ఆర్థికంగా కాస్త అటు ఇటు అయ్యే పరిస్థితి నెలకొంది. వీకెండ్‌కి కలెక్షన్స్ పుంజుకుంటే నిర్మాతలు సేఫ్‌ అయినట్లే, వీకెండ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే నిర్మాతలకు ఇబ్బందే కావచ్చు.