తాగుడుకు బానిసై హీరో చెల్లెలు నరకం
తప్ప తాగి మంచంపై నుంచి కుర్చీల పై నుంచి కింద పడిపోయేదానిని అని అంగీకరించింది ఈ పాపులర్ సెలబ్రిటీ కిడ్.
By: Tupaki Desk | 4 May 2025 9:30 PMతప్ప తాగి మంచంపై నుంచి కుర్చీల పై నుంచి కింద పడిపోయేదానిని అని అంగీకరించింది ఈ పాపులర్ సెలబ్రిటీ కిడ్. జీవితంలో తాగుడుకు బానిసైతే ఎదురయ్యే కష్టాల గురించి స్వీయానుభవంతో అందరినీ హెచ్చరించింది. తన కష్టం చూసి తల్లిదండ్రులు, సోదరుడు ఎంతగా నరకవేదన అనుభవించారో కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అలాగే తన అదుపు తప్పిన తాగుడు అలవాటు మాన్పించడానికి తనను కుటుంబీకులు రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చారని, అక్కడ 28 రోజులు నిదుర అన్నదే పట్టనీకుండా హింసించారని కూడా తెలిపింది. నా శరీరం నుంచి కెఫీన్ తొలగించారు. చాక్లెట్లు తొలగించారు. ఆల్కహాల్ మాన్పించినప్పుడు స్థిరంగా ఉండలేకపోయాను. గుండె దడ వచ్చేది.. ఆందోళన చెందేదానిని అని తన అనుభవాలను గుర్తు చేసుకుంది. బాధల్ని మర్చిపోయేందుకు తాగుతాం. కానీ దాని ఫలితం తర్వాత దారుణంగా అనుభవిస్తామని కూడా చెప్పింది. తాగుడు ఒక విష చక్రం. నేను బెడ్ పై నుంచి.. కుర్చీల మీద నుంచి కూడా కింద పడిపోయేదానిని అని తెలిపింది. ఇంతకీ ఎవరీ సెలబ్రిటీ కిడ్? అంటే.. స్టార్ హీరో హృతిక్ రోషన్ సోదరి.. దర్శకనిర్మాత రాకేష్ రోషన్ గారాల కుమార్తె సునైనా రోషన్.
సునైన చాలా కష్టాలను అధిగమించి చివరకు వ్యసనాన్ని అధిగమించానని తెలిపింది. అయితే తాను ఒకేసారి క్యాన్సర్, క్షయవ్యాధితో పోరాడటం వల్ల దానిని తట్టుకునేందుకు మద్యపానానికి బానిసయ్యానని కూడా వెల్లడించింది. పునరావాసంలో ఏడెనిమిది మంది కౌన్సిలర్లు నిరంతరం తన భరతం పట్టేవారని, అక్కడ ఉన్న 28రోజులు నిద్రపోలేదని తెలిపింది. నా శరీరం నుండి ప్రతిదీ బయటకు తీసేవారు. పెర్ఫ్యూమ్, కాఫీ, చక్కెర, చాక్లెట్ ఇవన్నీ బయటికి తీసేవారు. ఈ కఠిన ప్రక్రియ తర్వాత తాగుడు మానేశాను.. అని వెల్లడించారు.