RC17 పై అప్డేట్ ఇచ్చిన సుకుమార్
ఇదిలా ఉంటే సుకుమార్ గతంలోనే తన నెక్ట్స్ మూవీని రామ్ చరణ్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 May 2025 6:18 AMలెక్కల మాస్టారుగా కెరీర్ ను మొదలుపెట్టిన సుకుమార్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇంకా చెప్పాలంటే సుకుమార్ కెరీర్ పుష్ప ముందు ఒకలా అయితే పుష్ప తర్వాత ఒకలా అని చెప్పొచ్చు. పుష్ప సినిమాతో తన క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి పెరగడంతో పాటూ తాను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.
పుష్ప సినిమాతోనే మంచి క్రేజ్ వచ్చిందనుకుంటే పుష్పకు సీక్వెల్ గా వచ్చిన పుష్ప2 తో తన సత్తాను నెక్ట్స్ లెవెల్ లో చాటి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు సుకుమార్. ఒక్కమాటలో చెప్పాలంటే పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో సుకుమార్ యావత్ భారతదేశాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. దీంతో సుకుమార్ నెక్ట్స్ ఎవరితో ఎలాంటి సినిమా చేస్తారా అని అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే సుకుమార్ గతంలోనే తన నెక్ట్స్ మూవీని రామ్ చరణ్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప2 తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ ఓ భారీ సినిమాను ప్లాన్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాను చేస్తున్నాడు. పెద్ది మూవీ పూర్తయ్యే లోపు సుకుమార్ రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో పాటూ ప్రీ ప్రొడక్షన్ ను కూడా పూర్తి చేసి రెడీగా ఉంటే RC17 మొదలవుతుంది.
ఇక అసలు విషయానికొస్తే సుకుమార్ తాజాగా తన సొంత గ్రామమైన మట్టపర్రుకి వెళ్లి అక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలతో సరాదాగా గడిపారు. సుకుమార్ వచ్చాడని తెలిసి అక్కడికి మీడియా వెళ్లి ఆయన్ని పలకరించింది. ఈ సందర్భంగా సుకుమార్ మీడియాతో మాట్లాడి పలు విషయాలతో పాటూ తన నెక్ట్స్ మూవీకి సంబంధించిన విషయాలను కూడా వెల్లడించారు.
తన నెక్ట్స్ మూవీ రామ్ చరణ్ తో ఉంటుందని, ప్రస్తుతం RC17కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, పుష్ప2 మూవీ డైరెక్టర్ గా తనకు ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టిందని, ప్రతీ ఏడాదీ సంక్రాంతికి సొంతూరికి వస్తానని, కానీ మూడేళ్లుగా పుష్ప సినిమాల షూటింగ్ తో ఖాళీ లేక రాలేదని, నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి తప్పకుండా వస్తానని సుకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జనాలు థియేటర్లకు రావట్లేదనే విషయంపై సుకుమార్ రెస్పాండ్ అయ్యారు. గ్రామాల్లోని థియేటర్లలో ఇప్పటికీ సినిమాలు చూస్తున్నారని, సిటీలు, టౌన్లలో మాత్రమే జనాలు ఓటీటీలకు అలవాటు పడ్డారని చెప్పారు.