Begin typing your search above and press return to search.

కిచ్చా సుదీప్ కోసం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్టోరి

విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలను అందించిన స్టార్ రైట‌ర్.

By:  Tupaki Desk   |   4 Sep 2023 3:00 AM GMT
కిచ్చా సుదీప్ కోసం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్టోరి
X

విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలను అందించిన స్టార్ రైట‌ర్. మగధీర, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ఆల్ టైమ్ హిట్స్ కి క‌థ‌ల్ని అందించిన మేటి ర‌చ‌యిత‌. కంగ‌న‌కు మ‌ణిక‌ర్ణిక‌- త‌లైవి క‌థ‌ల‌ను ఇచ్చిన విజ‌యేంద్రుడు, స‌ల్మాన్ కు భజ‌రంగి భాయిజాన్ క‌థ ఇచ్చారు.. ఇవ‌న్నీ ఆయా చిత్రాల్లో న‌టించిన స్టార్ల‌కు అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని ఇచ్చిన‌వే. బాహుబ‌లి ర‌చ‌యిత‌గా అగ్ర‌తాంబూలం అందుకున్న విజ‌యేంద్రుడు స్టార్ రైట‌ర్ గా అద్భుతాల‌ను సృజిస్తున్నార‌న‌డంలో సందేహం లేదు. తాజాగా స‌మాచారం మేర‌కు.. మరో స్టార్ హీరోకి కథ ఇచ్చేందుకు విజ‌యేంద్రుడు రెడీ అవుతున్నాడు. శాండల్‌వుడ్ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ తాజా చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ పని చేస్తున్నారు. సెప్టెంబర్ 2న కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్సీ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కబ్జా దర్శకుడు ఆర్ చంద్రుతో కిచ్చా సుదీప్ గ‌తంలో ప‌ని చేసారు. ఇప్పుడు మరోసారి జోడీ కట్టబోతున్నాడు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఆర్‌సి స్టూడియోస్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. ఈ ఏడాది ఈ సంస్థ నిర్మించిన ఐదు సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలిపారు. అదేవిధంగా కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు, నటీనటులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు.

టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రిగా సుప‌రిచితులైన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ప‌రుచూరి సోద‌రుల‌కు స‌మ‌కాలికులు. ఆయన తెలుగు, తమిళం, హిందీ భాషలలో చాలా చిత్రాలకు క‌థ‌ల్ని అందించారు. తాజాగా కన్నడ హీరో కిచ్చ కూడా కథ సిద్ధం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. బాహుబ‌లి త‌ర్వాత భ‌జ‌రంగి భాయిజాన్ కోసం కోటి పైగా పారితోషికం అందుకున్న విజ‌యేంద్రుడు క్ర‌మంగా పారితోషికం పెంచార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇటీవ‌ల‌ ఒక్కో సినిమా క‌థ స్క్రిప్టు కోసం 10కోట్లు పైగా పారితోషికం అందుకుంటున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కిచ్చా సుదీప్ కోసం బాహుబ‌లి, భ‌జ‌రంగిని మించిన క‌థ‌ను అందించాల‌ని ఆయ‌న ప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ట‌. పారితోషికం భారీగా అందుకోబోతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.