Begin typing your search above and press return to search.

స్టార్ హీరో కొడుకు హిజ్రా పాత్ర‌తో ప్ర‌యోగం

ఆసక్తికరంగా అతడి తదుపరి థియేటర్ నాటకంలో త‌న పాత్ర‌తో స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం.

By:  Tupaki Desk   |   8 Nov 2023 5:43 AM GMT
స్టార్ హీరో కొడుకు హిజ్రా పాత్ర‌తో ప్ర‌యోగం
X

ఇంకా మొద‌టి సినిమా అయినా విడుద‌ల కాలేదు. కానీ స్టార్ హీరో వార‌సుడు ప్ర‌యోగాల‌తో ట్రెండీ టాపిక్ అవుతున్నాడు. థియేట‌ర్ నుంచి వెండితెర‌కు ప్ర‌మోట‌వుతున్న అత‌డు ఎవ‌రో కాదు .. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్.

అమీర్ ఖాన్, అతడి మాజీ భార్య రీనా దత్తా కుమారుడు జునైద్ ఖాన్ త్వరలో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. అయితే అత‌డు సినిమాల్లో ప్ర‌వేశించే ముందే గత కొంతకాలంగా థియేటర్ నాటకాల్లో న‌టిస్తున్నాడు. ఇప్పటికే నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. ఆసక్తికరంగా అతడి తదుపరి థియేటర్ నాటకంలో త‌న పాత్ర‌తో స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. జునైద్ ఖాన్ పాత్ర గురించిన వివరాలు ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

జునైద్ ఖాన్ తన తదుపరి థియేటర్ ప్లేలో ట్రాన్స్ వుమన్ (హిజ్రా) పాత్రలో నటించనున్నాడు

జాతీయ మీడియా క‌థ‌నాల ప్రకారం... యువ నటుడు జునైద్ `స్ట్రిక్ట్‌లీ అన్‌కన్వెన్షనల్` అనే పేరుతో రూపొందిన నాటకంలో కనిపించనున్నారు. 15 నవంబర్ 2023 సాయంత్రం ముంబైలోని పృథ్వీ థియేటర్‌లో తొలి ప్రదర్శనకు ఏర్పాట్లు సాగుతున్నాయి. జునైద్ ఖాన్ ఈ నాటకంలో ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడని, అతడి పాత్రల్లో ఒకటి ట్రాన్స్ వుమన్ పాత్ర అని తెలిసింది.

ఈ స్టేజీ నాటకంలో జునైద్ రెండు వేర్వేరు పాత్ర‌ల‌తో స‌ర్ ప్రైజ్ చేయ‌నున్నాడు. ట్రాన్స్ వుమన్ పాత్ర విషయానికి వస్తే, జునైద్ ఆడ‌వారి సాంప్రదాయ దుస్తులు ధ‌రించి విగ్‌తో ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంటాడు. ఈ నాటకంలో అమీర్ ఖాన్ తనయుడు పోషించిన రెండో పాత్ర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

జునైద్ ఖాన్ థియేటర్ కెరీర్..

నిజానికి జునైద్ న‌ట‌న‌కు కొత్త‌వాడు కాదు. అత‌డు ఇప్ప‌టికే స్టేజీ డ్రామా ద్వారా బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్నాడు. బెర్టోల్ట్ బ్రెచ్ట్ ప్రసిద్ధ నాటకం `మదర్ కరేజ్ అండ్ హర్ చిల్డ్రన్` రంగస్థల అనుకరణతో జునైద్ ఖాన్ ఆగస్టు 2017లో థియేటర్ నటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత అత‌డు థియేటర్ నాటకాల రంగంలో మంచి ప్రతిభను సంపాదించుకున్నాడు. సంవత్సరాలుగా కొన్ని ముఖ్యమైన ప్రదర్శనలతో అల‌రించాడు.

పెద్ద తెర‌పైకి ఆరంగేట్రం?

తాజా క‌థ‌నాల ప్రకారం.. జునైద్ ఖాన్ ప్రతిష్టాత్మక యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించ‌నున్న `మ‌హారాజ్‌` చిత్రంతో నటుడిగా వెండితెరపైకి అడుగుపెట్టనున్నాడు. అతడి స‌ర‌స‌న‌ సౌత్ స్టార్ సాయి పల్లవి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సాయి ప‌ల్ల‌వికి ఇది బాలీవుడ్ అరంగేట్ర చిత్రం. ఇది ప్రేమకథా చిత్రం.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. త‌న‌యుడు జునైద్ తన తొలి ప్రాజెక్ట్ కి ఎంపిక కావడానికి ముందు 15కి పైగా ఆడిషన్స్‌లో తిరస్కర‌ణ‌కు గుర‌య్యాడ‌ని వెల్లడించారు. తన కొడుకు డెబ్యూ సినిమాని తానే ప్రారంభించాలనే ఉద్దేశ్యం అతడికి ఎప్పుడూ లేదని తెలిపారు. ఎందుకంటే ప్రతిభావంతులైన కళాకారులు మాత్రమే చిత్ర పరిశ్రమలో మనుగడ సాగించగలరని అమీర్ ఖాన్ నమ్ముతున్నారు.