Begin typing your search above and press return to search.

రివ్యూ రైటర్స్​పై శ్రీకాంత్ అయ్యంగర్ గుస్సా​..

శ్రీకాంత్ అయ్యంగర్.. క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Aug 2023 8:10 AM GMT
రివ్యూ రైటర్స్​పై శ్రీకాంత్ అయ్యంగర్ గుస్సా​..
X

శ్రీకాంత్ అయ్యంగర్.. క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్​గా శ్రీ విష్ణు హీరోగా వచ్చిన 'సామజవరగమన' సినిమాలో హీరోయిన్​ వాళ్ల నాన్నగా.. తాజాగా హీరో కార్తికేయ నటించిన బెదురులంక 2012లోనూ బ్రహ్మంగా నటించి ఆకట్టుకున్నారు. అయితే తాజాగా బెదురులంక 2012 సక్సెస్​ మీట్​లో పాల్గొన్న శ్రీకాంత్​.. మూవీ రివ్యూ రైటర్స్​పై కాస్త మండిపడ్డారు.

ఆయన మాట్లాడుతూ.. "మూవీటీమ్​ అంతా బాగా పనిచేసింది. మా అన్నయ్య అజయ్ ఘోష్ అద్భుతంగా నటించారు. ఆయనది తిమింగల స్వరూపం. ఆయన దగ్గర నేర్చుకుని ఆయనతో కలిసి నటించే మంచి అవకాశం దక్కింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎంతలా కష్టపడ్డాం అనే విషయం జనాలకు అస్సలు తెలీదు. కనబడదు. రివ్యూస్, గివ్యూస్ రాసేస్తారు. మనమేదైనా పీకుడు పనిచేసి, సాధించి ఇంకొకడు గురించి రాస్తే పర్వాలేదు. కెమెరా వర్క్ వస్తది, రాదని ఎవడో రాస్తే మనం ఇక్కడ ఎందుకుంటాం?" అంటూ ప్రశ్నించారు.

"కాంతార సినిమాకు ఒక్క రివ్యూ లేదు. కానీ జనాలు దాన్ని హిట్టు చేయలేదా? ప్రేక్షకులకు ఏమీ చెప్పనవసరం లేదు. వాళ్లకు ఒక విషయం నచ్చితే వాళ్లే థియేటర్లకు వచ్చి ఆదరిస్తారు. నచ్చకపోతే పట్టించుకోరు" అంటూ శ్రీకాంత్ కాస్త గట్టిగా మాట్లాడారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర క్లాక్స్ పని చేస్తున్నప్పుడు తాను క్లాక్స్​ను కలిసినట్లు గుర్తుచేసుకున్నారు. తనకు మంచి వేషం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్ చెప్పారు. 'చావు కబురు చల్లగా' చిత్రంలోలో కార్తికేయతో కలిసి నటించానని గుర్తుచేసుకుంటూ.. కార్తికేయలో సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు ఉన్నాయని ప్రశంసించారు.

ఇకపోతే 'బెదురు లంక 2012' సినిమా విషయానికొస్తే.. 2012 యుగాంతం కాన్సెప్ట్​లో వచ్చిన ఈ చిత్రంలో కాన్ కార్తికేయ గుమ్మకొండ, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ అందుకుంది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో దర్శకుడు వర్మ శిష్యుడు క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగర్ ఇంకా ఆటో రాంప్రసాద్ కామెడీ బాగానే పేలిందంటున్నారు. కథా నేపథ్యం, కార్తికేయ నటన, యుగాంతం నేపథ్యంలో పండే వినోదం ఈ చిత్రానికి బలాలు. కాకపోతే నెమ్మదిగా సాగే కథనం, ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు బలహీనతలు అని చెప్పొచ్చు. మొత్తంగా చెప్పాలంటే.. ఆరంభంలో కాస్త బెదరగొట్టినా.. ద్వితీయార్ధం కడుపుబ్బా నవ్వించింది.