నటి ముత్తాతకు దెయ్యం చెంప దెబ్బ
ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన కుటుంబం రాత్రికి రాత్రే తమ ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చిన నిజ జీవిత టెర్రర్ స్టోరీని గుర్తుచేసుకుంది.
By: Tupaki Desk | 17 April 2025 5:08 PMఇటీవల 'స్త్రీ 2' లాంటి 800కోట్లు వసూలు చేసిన హారర్ చిత్రాన్ని ప్రజలు చూసి ఉండొచ్చు. అంతకుముందు రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన ఫ్రాంఛైజీ సినిమాలు చూసి భయపడి ఉండొచ్చు. కానీ అవన్నీ వెండితెర అనుభవాలు.. అనుభూతికి సంబంధించిన వ్యవహారాలు.
కానీ ఇక్కడ నటి నిజ జీవితంలో అనుభవం అవాక్కయ్యేలా చేస్తోంది. సదరు నటీమణి ముత్తాత నిజంగా దెయ్యాన్ని చూసాడు. అంతే కాదు ఆ దెయ్యం అతడిని చెంప దెబ్బ కొట్టింది. దీంతో భయపడి ఏకంగా ఆ ఇల్లు ఖాళీ చేయడానికి బ్యాగులు సర్ధేశారు.. వేరే ఇంటికి మారిపోయారు. ఈ అనుభవం ఎదురైంది ఎవరికో కాదు.. ఆదిపురుష్ విలన్ సైఫ్ ఖాన్ ముత్తాతకు. ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు సైఫ్ ఖాన్ సోదరి సోహా అలీఖాన్. ఈ భామ ఇటీవల ప్రైమ్ వీడియో హర్రర్ చిత్రం 'చోరీ 2' లో నటించింది.
ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన కుటుంబం రాత్రికి రాత్రే తమ ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చిన నిజ జీవిత టెర్రర్ స్టోరీని గుర్తుచేసుకుంది. ఇటీవలి ఇంటర్వ్యూలో సోహా అలీ ఖాన్ ఆ రోజుల్లో తమకు అతీంద్రియ శక్తితో ప్రత్యక్ష అనుభవం ఎదురైందని, దెయ్యాల్ని తన కుటుంబం నమ్ముతుందని కూడా వెల్లడించింది. సోహా రాజకుటుంబం ప్రసిద్ధ పటౌడీ ప్యాలెస్కు మారే ముందు పీలీ కోఠి అనే వేరే ప్యాలెస్లో నివసించింది. అక్కడ తమ ముత్తాత తనను ఒక అతీంద్రియ శక్తి బలంగా దెబ్బ కొట్టిందని చెప్పాడు. ఆ తర్వాత మొత్తం కుటుంబం తమ బ్యాగులు సర్దుకుని ఇల్లు ఖాళీ చేసారు.
పటౌడీ ప్యాలెస్ పక్కన ఒక ప్యాలెస్ ఉంది. దీనిని పీలి కోఠి అని పిలుస్తారు. మా కుటుంబం ఒకే ఒక్క రాత్రి అక్కడ నివసించింది. కానీ వెంటనే బ్యాగులు సర్దుకుని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత కుటుంబం అంతా పటౌడీ ప్యాలెస్కు మారారు. అకస్మాత్తుగా ఉన్న ఇల్లు నుంచి మారడానికి కారణం ఒక అతీంద్రియ శక్తి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు.. ఎందుకంటే నేను అప్పుడు అక్కడ లేను. కానీ మా ముత్తాతను ఒక దెయ్యం కొట్టింది. ఆమె ముఖంపై ఉన్న గుర్తును తాతయ్య చూడగలిగారు. ఇది వారిని భయపెట్టింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు! అని సోహా అలీ ఖాన్ చెప్పారు. ఇప్పటికీ ఆ మిస్టీరియస్ భవంతిలో ఎవరూ నివశించడం లేదని కూడా సోహా చెప్పింది.
పటౌడీ ప్యాలెస్ ని 1934లో నిర్మించారు. దీనికి ముందు అలీఖాన్ కుటుంబంలోని కొన్న తరాలు పీలీ కోఠిలో నివసించాయి. భోపాల్ నవాబ్ పటౌడీ కుటుంబం నుండి వివాహ ప్రతిపాదనను తిరస్కరించాడు. ప్యాలెస్ చిన్నదిగా ఉందని, అది తన కుమార్తెకు తగదని చెప్పాడు. ఈ తిరస్కరణతో పటౌడీ నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ ఇప్పుడు పటౌడీ ప్యాలెస్ అని పిలుస్తున్న భవంతి నిర్మాణాన్ని ప్రారంభించాడు. దీనిని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ టోర్ రస్సెల్ - ఆస్ట్రియన్ ఆర్కిటెక్ట్ కార్ల్ మోల్ట్ వాన్ హీన్జ్ డిజైన్ అందించారు. ఈ పటౌడీ ప్యాలెస్ ఖరీదు- 800 కోట్లు.