Begin typing your search above and press return to search.

ఓంకార్ తమ్ముడు.. ఈసారి 'శివం భజే'

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఓంకార్ ఆ తరువాత డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   11 March 2024 1:05 PM GMT
ఓంకార్ తమ్ముడు.. ఈసారి శివం భజే
X

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఓంకార్ ఆ తరువాత డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే. ఇక అతని తమ్ముడు అశ్విన్ బాబు రాజుగారి గది సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నాడు. అనంతరం సోలోగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న అశ్విన్ ఇప్పుడు కొత్త ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం. 1లో నటుడు అశ్విన్ బాబు ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అప్సర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన టైటిల్ తోనే మేకర్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.

'శివం భజే' అనే టైటిల్ ను ఎనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ అద్భుతమైన టైటిల్ పోస్టర్‌లో శివుని గంభీరమైన చిత్రాన్ని హైలెట్ చేశారు. హీరో ఎత్తైన పర్వతాల నడుమ ఒక వీరుడిగా నిలబడినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక మేకర్స్ ఇప్పటికే 80% షూటింగ్‌ను పూర్తి చేశారు. మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అశ్విన్‌ అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం వినోదం, యాక్షన్‌, ఎమోషన్‌, థ్రిల్‌ల మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మా దర్శకుడు అప్సర్ కథ మరియు అరుదైన స్క్రీన్‌ప్లేపై నమ్మకంతో ఉన్నాము. సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి.

మా మొదటి ప్రొడక్షన్ వెంచర్‌లో మా హీరో అశ్విన్, ప్రతిభావంతులైన అర్బాజ్ ఖాన్, తమిళ నటుడు సాయి ధీనా హైపర్ ఆదితో కలిసి పని చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అలాగే చాలా మంది ప్రతిభావంతులైన నటీనటులు సాంకేతిక నిపుణులు మా చిత్రంలో భాగమయ్యారు. ప్రస్తుతం షూటింగ్ చివరి షెడ్యూల్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఇక 'శివం భజే'ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.. అని నిర్మాత అన్నారు.

దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. ప్రేక్షకులను అలరించేలా కమర్షియల్‌ అంశాలతో కూడిన విభిన్నమైన కథ ఇది. మా హీరో అశ్విన్‌బాబు, అర్బాజ్‌ ఖాన్‌తో కలిసి నిర్మాత మహేశ్వర్‌ రెడ్డి గారి గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సినిమా చేయడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. షూటింగ్ లాస్ట్ లో ఉంది. ఇక 'శివం భజే' అనేది మా సినిమాకు సరైన టైటిల్ అని భావిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన అద్భుతమైన అప్‌డేట్‌లు త్వరలో వెలువడనున్నాయని దర్శకుడు తెలియజేశారు.