శశ్ఠిపూర్తి: మాస్ మహారాజ వదిలిన మరో మెలోడీ మాయ
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం శశ్ఠిపూర్తి నుండి తాజాగా రెండవ పాట ‘ఇరు కన్నులు కన్నులు’ విడుదలైంది.
By: Tupaki Desk | 11 April 2025 4:47 AMప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం శశ్ఠిపూర్తి నుండి తాజాగా రెండవ పాట ‘ఇరు కన్నులు కన్నులు’ విడుదలైంది. మాస్ మహారాజా రవి తేజ చేతుల మీదుగా ఈ మెలోడీ సాంగ్ లాంచ్ కావడం విశేషం. తనదైన శైలిలో రవి తేజ ఈ పాటను ప్రశంసించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు ఈ చిత్రంలో కనిపించటం సినిమాకే ప్రత్యేక ఆకర్షణని చెప్పారు. పాటలో వచ్చే శుభ శాంతి భావాలు, మధురమైన వాయిస్ లు సినిమాకి మంచి వాతావరణాన్ని కలిగిస్తాయన్నారు.
ఈ సినిమాలో లేడీస్ టైలర్ ఫేమ్ అర్చన, రాజేంద్ర ప్రసాద్ భార్య భర్తలుగా కనిపించనుండగా.. మరో జంటగా రుపేష్ - ఆకాంక్ష సింగ్ లు రొమాంటిక్ కెమిస్ట్రీతో కనువిందు చేయనున్నారు. ఈ రెండో సింగిల్ను ఎస్పీ చరణ్, విభావరి అప్తే జోషి పాడగా.. సంగీతం మాస్ట్రో ఇళయరాజా అందించారు. పాట విడుదల సందర్భంగా యూనిట్ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు.
దర్శకుడు పవన్ ప్రభా ఈ పాట గురించి మాట్లాడుతూ.. ఇది మొదటి విన్నపుడే మనసుకు మంచి ఫీల్ ఇస్తుందని చెప్పారు. పాటకు రాహ్మాన్ రాసిన సాహిత్యం అందరినీ కట్టిపడేస్తుందని అభిప్రాయపడ్డారు. పాటను రాజమండ్రి పరిసరాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరించగా.. కొరియోగ్రఫీ ఈశ్వర్ పెంటి, సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైన్ థోటా తరణి అందించారు.
ఈ సాంగ్ కి ముందు విడుదలైన ‘ఎదో ఏ జన్మలొదో’ పాట కూడా మంచి రెస్పాన్స్ను రాబట్టింది. ముఖ్యంగా ఎమ్ఎం కీరవాణి రాసిన సాహిత్యం, నేపథ్య సంగీతం కలిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చక్రపాణి ఆనంద్, కాంతార ఫేమ్ అచ్యుత్ కుమార్, ప్రభాస్ శ్రీను, చలాకీ చంటి, మురళీధర్ గౌడ్, జబర్దస్త్ రామ్ లాంటి పలువురు పాత్రధారులు భాగమవుతున్నారు.
ఇది కేవలం ఒక కుటుంబ కథే కాకుండా.. బంధాల విలువను చెప్పే ఒక ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోందని యూనిట్ చెబుతోంది. ఈ జెనరేషన్కి తల్లిదండ్రుల అభిప్రాయాలు ఎలా ఉంటాయో, పిల్లల భవిష్యత్తుపై పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పే విధంగా ఈ కథ ఉన్నట్టు దర్శకుడు తెలిపారు. రవి తేజ కూడా ఈ కథ తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రం అంటూ వివరణ ఇచ్చారు.