సందీప్ వంగ కల నిజమైంది, కానీ..!
ఇండస్ట్రీలో ఉన్న ప్రతి నటుడికి డ్రీమ్ రోల్, ప్రతి దర్శకుడికి డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది.
By: Tupaki Desk | 24 April 2026 1:20 PM ISTఇండస్ట్రీలో ఉన్న ప్రతి నటుడికి డ్రీమ్ రోల్, ప్రతి దర్శకుడికి డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. చాలా మంది హీరోలకు, హీరోయిన్స్కి, తమ డ్రీమ్ రోల్ చేసే అవకాశం రాదు, ఇక చాలా తక్కు మంది దర్శకులు మాత్రమే తమ డ్రీమ్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించిన దాఖలాలు ఉన్నాయి. ప్రతి దర్శకుడికి ఉన్నట్లుగానే ప్రముఖ దర్శకుడు సందీప్ వంగకి సైతం డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో సందీప్ వంగ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ తనకు ఎంతో ఇష్టమైన మైఖేల్ జాక్సన్ బయోపిక్ను తీయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ బయోపిక్ తీస్తే తానంత అదృష్టవంతుడు మరొకరు ఉండరు అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడారు. అంతే కాకుండా మైఖేల్ జాక్సన్ బయోపిక్ తీసే అవకాశం వస్తే అంతకు మించిన సంతోషం తన జీవితంలో ఉండదు అని కూడా ఆ ఇంటర్వ్యూలో సందీప్ వంగ చెప్పుకొచ్చాడు.
మైఖేల్ జాక్సన్ బయోపిక్ కోసం...
సందీప్ వంగ గత కొన్ని సంవత్సరాలుగా మైఖేల్ జాక్సన్ బయోపిక్ తీయాలని కలలు కంటున్నాడు. సందీప్ వంగ కలల్లో ఉండగానే మైఖేల్ జాక్సన్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు మైఖేల్ టైటిల్ తో మైఖేల్ జాక్సన్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైఖేల్ జాక్సన్ కుటుంబ సభ్యుల నుంచి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. అంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెంచారు. ప్రపంచ వ్యాప్తంగా మైఖేల్ ను అభిమానించే వారు. అయితే ఆయన చనిపోయి దాదాపు 20 ఏళ్లు అవుతున్న కారణంగా ఇప్పుడు ఆయన బయోపిక్ ను జనాలు చూస్తారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అనుమానాలు పటాపంచలు చేస్తూ అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయ్యింది.
సందీప్ రెడ్డి వంగ డ్రీమ్ ప్రాజెక్ట్...
ఇండియాలోనే మైఖేల్ మూవీకి లక్షకు పైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ కావడం రికార్డ్గా చెప్పుకోవచ్చు. కేవలం ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే ఇండియాలోనూ స్క్రీనింగ్ అవుతోంది. ఇంగ్లీష్ లోనూ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు అంటే ఆయన క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన జీవితాన్ని అంతా తెలిసిన వారు సినిమాగా తీస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి ఉన్నప్పటికీ దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు అంటోయిన్ ఫుక్వా దర్శకత్వంలో సినిమా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైఖేల్ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది. ఆయన క్రేజ్ ఎలా పెరిగింది. ఆయన షో లకు వచ్చే రెస్పాన్స్ అన్నింటిని కూడా సినిమాలో చక్కగా చూపించారు అంటూ ప్రివ్యూ టాక్ వచ్చింది. మైఖేల్ సినిమా విడుదల నేపథ్యంలో సందీప్ వంగ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
హాలీవుడ్ మూవీ మైఖేల్ రిలీజ్ టుడే...
అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు దక్కించుకున్నాడు. అలాంటి దర్శకుడు మైఖేల్ జాక్సన్ కథతో హిందీలో సినిమా తీసి ఉంటే కచ్చితంగా బాలీవుడ్తో పాటు, ఇతర ఇండియన్ భాషల్లో మంచి స్పందన వచ్చి ఉండేది. హాలీవుడ్లోనూ సినిమా గురించి చర్చ జరిగి ఉండేది. మైఖేల్ జాక్సన్ పాత్రను పోషించేందుకు సరైన నటుడు లేకపోవడం వల్ల ఆయన ఇన్నాళ్లు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకు వెళ్లలేక పోయాడు అనేది కొందరి మాట. తాను తీయాలి అనుకున్న మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను ఎవరు తీసినా కూడా కచ్చితంగా తాను థియేటర్ కి వెళ్లి చూస్తాను అంటూ ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే త్వరలోనే సందీప్ వంగ మైఖేల్ సినిమాను థియేటర్ లో చూసేందుకు రెడీ అవుతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. మైఖేల్ జాక్సన్ జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని సందీప్ రెడ్డి వంగకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు ఉంటుంది. అందుకే మైఖేల్ సినిమాకు మంచి స్పందన దక్కడం ఖాయం.
