సమంత ప్లాన్ వేరే!
ఈ రోజుల్లో సినిమా తీయడం ముఖ్యం కాదు, దాన్ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లగలడం ముఖ్యమైంది.
By: Tupaki Desk | 26 April 2025 3:30 PMఈ రోజుల్లో సినిమా తీయడం ముఖ్యం కాదు, దాన్ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లగలడం ముఖ్యమైంది. కొన్ని సినిమాలు సరైన ప్రమోషన్స్ లేక అసలు ఎప్పుడు థియేటర్లలోకి వచ్చాయో ఎప్పుడు థియేటర్ల నుంచి పోతున్నాయో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతీ సినిమాకీ ప్రమోషన్స్ అనేవి చాలా కీలకంగా మారాయి. దర్శకధీరుడు రాజమౌళి అంతటి వారే తన సినిమాను ఎడతెరిపి లేకుండా ప్రమోషన్స్ చేస్తారు.
కానీ కొంతమంది మాత్రం సినిమా రిలీజయ్యాక తమ సినిమాలోని కంటెంటే మాట్లాడుతుంది. ఆ కంటెంట్ చూశాక ఆడియన్స్ అందరూ తమ సినిమా గురించే మాట్లాడుకుంటారు. సినిమా టాక్ చూసి ఆడియన్సే థియేటర్లలోకి వస్తారనుకుని ప్రమోషన్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇప్పుడు అసలు ఇదంతా ఎందుకు అనుకోవచ్చు. అసలు విషయానికొద్దాం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే నటిగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా సక్సెస్ ను అందుకున్న సమంత ఇప్పుడు నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా మారింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో బ్యానర్ ను స్థాపించి దాని ద్వారా మంచి కంటెంట్ ను ఆడియన్స్ కు అందిస్తానని చెప్పింది.
అందులో భాగంగానే సమంత మొదటిగా శుభం అనే సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తుంది. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే రిలీజ్ కు పట్టుమని పదిహేను రోజులు కూడా లేదు. కానీ ఇప్పటివరకు సినిమా నుంచి కేవలం టీజర్ మినహా మరే కంటెంట్ వచ్చింది లేదు. నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమంతకు ప్రమోషన్స్ ఎంత కీలకమో తెలిసి కూడా సైలెంట్ గా ఎందుకుందని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు మాత్రం సమంత ప్లాన్ వేరే ఉందని, టీజర్ తో వచ్చిన హైప్ ను మరింత పెంచాలంటే సరైన ట్రైలర్ పడాలని, దాని మీదే సమంత తన ఫోకస్ మొత్తం పెట్టిందని, ట్రైలర్ రిలీజయ్యాక అందరూ శుభం గురించే మాట్లాడుకునేలా చేసి, అప్పట్నుంచి ప్రమోషన్స్ ను వేగవంతం చేసే దిశగా సమంత ప్లాన్ చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో సమంత నిర్మాతగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.