Begin typing your search above and press return to search.

సల్మాన్‌ ఇంటి వద్ద పోలీసు వాహనం మిస్సింగ్‌... గ్యాంగ్‌ స్టర్‌ తమ్ముడి పోస్ట్ వైరల్!

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 April 2024 7:59 AM GMT
సల్మాన్‌ ఇంటి వద్ద పోలీసు వాహనం మిస్సింగ్‌... గ్యాంగ్‌ స్టర్‌ తమ్ముడి పోస్ట్ వైరల్!
X

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ముంబై బాంద్రా ప్రాంతంలో సల్మాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు బైక్‌ పై వచ్చిన ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపడంతో ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సమయంలో సంచలన విషయాలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది! ఇందులో ప్రధానంగా... సల్మాన్ ఖాన్ ఇంటివద్ద ఉండే పోలీస్ వాహనం మిస్సవ్వడం.. ఆ సమయలోనే అక్కడ కాల్పులు జరగడం వంటి విషయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఇదే సమయంలో... గ్యాంగ్‌ స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడి పేరుతో విడుదలైన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది!

అవును... సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద నాలుగు రౌండ్ల కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో కీలక విషయాలు తెరపైకి వచ్చాయని తెలుస్తుంది. ఇదంతా... గ్యాంగ్ స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా పనేనని తెలుస్తోంది!

ఈ సమయంలో... రెగ్యులర్ గా సల్మాన్‌ ఖాన్ ఇంటి ముందు ఎప్పుడూ నిలిపి ఉంచబడే పోలీస్ వాహనం... ఆదివారం ఉదయం కాల్పులు జరిగిన సమయంలో అక్కడ లేదని దర్యాప్తులో తేలిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసును క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తుండగా.. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌, ఎన్.ఐ.ఏ. అధికారులు కూడా ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

ఈ దర్యాప్తులో భాగంగా... కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో ఐదు ఖాళీ షెల్స్‌, ఒక లైవ్‌ బులెట్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అందులో ఓ ఖాళీ షెల్‌.. సల్మాన్‌ ఇంటి బాల్కనీలో గుర్తించారని తెలియడం గమనార్హం. పైగా ఈ ఘటన సమయంలో సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రమంలో... నిందితులు ఉపయోగించిన బైక్‌ ను సల్మాన్‌ ఇంటికి కిలోమీటరు దూరంలో స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి వారు ఆటో రిక్షాలో పరారైనట్లు గుర్తించిన పోలీసులు... వారిని గాలించేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు కాల్పుల తర్వాత నిందితులు బాంద్రా వదిలి పారిపోయినట్లు అనుమానిస్తుండగా.. ప్రస్తుతం సీసీటీవీ దృశ్యాలను జల్లెడపడుతున్నారని తెలుస్తుంది.

గ్యాంగ్ స్టర్ తమ్ముడి పోస్ట్ వైరల్:

ఆ పరిస్థితులు అలా ఉండగా... కాల్పుల జరిగిన తర్వాత గ్యాంగ్‌ స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ పేరుతో ఓ పోస్ట్‌ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... "సల్మాన్‌ ఖాన్‌.. నీకు ట్రైలర్‌ మాత్రమే చూపించాం. మా సామర్థ్యం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదే నీకు చివరి వార్నింగ్‌" అని రాసి ఉన్న ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అన్మోల్‌ పై 18 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈ క్రమంలోనే 2021 అక్టోబరులో జోధ్‌ పుర్‌ జైలు నుంచి విడుదలైన అతడు విదేశాలకు పారిపోయి.. ప్రస్తుతం కెనడాలో ఉన్నట్లు చెబుతున్నారు.