Begin typing your search above and press return to search.

బిష్ణోయ్‌కి ప్ర‌తి స‌వాల్.. కాల్పుల‌ త‌ర్వాత‌ మార్నింగ్ వాక్

ఎదుటివాడు ఎంత పెద్ద గ్యాంగ్ స్ట‌ర్ అయినా భ‌య‌ప‌డ‌కుండా ఎదురు నిలిచేవాడు మ‌గాడు.

By:  Tupaki Desk   |   15 April 2024 4:05 AM GMT
బిష్ణోయ్‌కి ప్ర‌తి స‌వాల్.. కాల్పుల‌ త‌ర్వాత‌ మార్నింగ్ వాక్
X

ఎదుటివాడు ఎంత పెద్ద గ్యాంగ్ స్ట‌ర్ అయినా భ‌య‌ప‌డ‌కుండా ఎదురు నిలిచేవాడు మ‌గాడు. ఇలాంటి తెగువ‌తో బాలీవుడ్ స్టార్ హీరో తండ్రిగారైన స‌లీమ్ ఖాన్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. త‌న‌ను త‌న కొడుకును చంపేస్తానంటూ బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్ కే 80 ఏళ్ల వ‌యసున్న అత‌డు ఎదురెళ్లాడు. నువ్వు ఏమైనా చేస్కో నేను ఎంచ‌క్కా మార్నింగ్ వాక్ కి వెళ‌తాను అంటూ త‌న ఇంటి ముందు కాల్పుల క‌ల‌క‌లాన్ని కూడా ప‌ట్టించుకోలేదు. అత‌డు అద‌ర‌క బెద‌ర‌క సైలెంట్ గా త‌న ప‌నిలో తానున్నాడు.

ఆదివారం ఉద‌యం సల్మాన్ ఖాన్ కి చెందిన‌ బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ వ‌ద్ద కాల్పుల ఘటన అనంత‌రం ఆ ప్రాంతంలో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. పోలీసులు బోలెడంత హైరానా ప‌డుతూ స‌ల్మాన్ ఇంటికి కాప‌లా కాస్తున్నారు. ఏప్రిల్ 14 తెల్లవారుజామున జరిగిన తుపాకీ కాల్పుల ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేయ‌గా, ప‌రిస్థితి అమాంతం మారింది. భయానక తుపాకీ కాల్పులు సూపర్ స్టార్ స‌ల్మాన్ అతడి కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, అతని అభిమానులు, స్నేహితులకు కూడా షాక్ ఇచ్చాయి. అయితే ఈ ఘ‌ట‌న‌కు స‌ల్మాన్ ఖాన్ తండ్రి స‌లీమ్ ఖాన్ ఎంత‌మాత్రం బెదిరిపోలేద‌ని స‌ల్మాన్ స్నేహితుడు తెలిపారు. వారంతా క్షేమంగా ఉన్నార‌ని, సంఘటన తర్వాత కూడా వారందరూ చాలా సాధారణంగా ఉన్నారని స‌ల్మాన్ స్నేహితుడు ఒక‌రు తెలిపారు.

సల్మాన్ ఖాన్ సన్నిహితుడైన జాఫర్ సరేష్వాలా అనే వ్యాపారవేత్త జూమ్‌తో మాట్లాడాడు. ఈ ఇంట‌రాక్ష‌న్ లో స‌ల్మాన్ కుటుంబం క్షేమంగా ఉన్నారని, ఈ సంఘటన తర్వాత కూడా వారు చాలా సాధారణంగా ఉన్నారని వెల్లడించారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగినప్పుడు సల్మాన్ తన కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. కాల్పుల త‌ర్వాత‌ జాఫర్‌ యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు స‌ల్మాన్ ఇంటికి వెళ్లాడు. అతని వివ‌రాల ప్రకారం.. సల్మాన్ తండ్రి లెజెండరీ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అత‌డు అత‌డి కుటుంబం పూర్తిగా సాధారణ స్థితిలో ఉన్నారు. దాడికి ఎవ‌రూ ప్రభావితం కాలేదు.. అని తెలిపారు.

ఆ స‌మయంలో స‌లీం ఖాన్ త‌న ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చిన జాఫ‌ర్ తో ఇలా అన్నారు. ఇవ‌న్నీ ప్ర‌గ‌ల్బాలు. మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయడానికి భయపెట్టడానికి ఇలా చేసారు. చూడండి.. మేము సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపాము.. మేము తప్పించుకున్నాము.. ఇప్పుడు మీరు రూ. 50 లక్షలు సిద్ధంగా ఉంచండి! అంటారు. ఇదంతా జ‌న‌ర‌లైజ్ చేయ‌డానికి మాత్రమే. సల్మాన్ చాలా లైట్ తీస్కున్నాడు! అని స‌లీమ్ ఖాన్ అన్నారు. ఘ‌ట‌న త‌ర్వాత స‌లీమ్ ఖాన్ చాలా ధైర్యంగా మార్నింగ్ వాక్ చేసారు. దీనిని ముంబై పోలీస్ క‌మీష‌న‌ర్ కూడా ప్ర‌శంసించారు. నిజానికి స‌ల్మాన్ తండ్రి సాధారణంగా బయటకు వచ్చే గ్యాలరీపై తుపాకీ కాల్పులు జరిగాయి.

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆదివారం ఉదయం 5:00 గంటలకు సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీల‌తో కాల్పులు జరిపారు. గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల మూడుసార్లు తుపాకీ కాల్పులు జ‌రిగాయి. గాలిలో మూడు సార్లు కాల్పులు జరిపారు. దిగ్భ్రాంతికరమైన సంఘటన తరువాత స‌ల్మాన్ నివాసం వెలుపల భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఇది దురదృష్టకర సంఘటన అని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స‌ల్మాన్ కుటుంబ భద్రతను అంచనా వేయాలని దానిని మ‌రింత‌ పెంచాలని ముంబై పోలీసు కమిషనర్‌కు సమాచారం అందించామని ముఖ్యమంత్రి తెలిపారు. అంతేకాకుండా సంఘటన జరిగిన వెంటనే స‌ల్మాన్ తో టెలిఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన మహారాష్ట్ర సిఎం భాయ్ తో మాట్లాడాన‌ని తెలిపారు. ``సల్మాన్ ఖాన్‌తో కూడా మాట్లాడాను. ప్రభుత్వం తన వెంటే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాను. అతనికి హాని కలిగించే ఏదీ జరగదు. అందుకే ఈ ఘ‌ట‌న‌కు కార‌కుల‌పై వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులకు కూడా తెలియజేశాను... అని అన్నారు. ఘ‌ట‌న‌కు కార‌కుల‌ను విడిచిపెట్టేది లేద‌ని కూడా సీఎం అన్నారు.