Begin typing your search above and press return to search.

సాయిపల్లవి టార్గెట్ అవుతోంది

అప్పట్లో ఈ వ్యాఖ్యలపై కొంత వివాదం నడిచింది. తర్వాత సద్దుమణిగింది. కట్ చేస్తే ఇప్పుడు సాయిపల్లవి హిందీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 April 2024 7:17 PM GMT
సాయిపల్లవి టార్గెట్ అవుతోంది
X

ఈ రోజుల్లో ఫిలిం సెలబ్రెటీలు వివాదాస్పద అంశాల గురించి నోరు తెరవకుండా ఉంటే మంచిదేమో. ఏదైనా ఇంటర్వ్యూల్లో యథాలాపంగా ఏదైనా అభిప్రాయం చెబితే.. దాన్ని పట్టుకుని తీవ్ర స్థాయిలో ద్వేషం చిమ్ముతున్నారు నెటిజన్లు. ఎప్పుడో మాట్లాడిన మాటల్ని పట్టుకుని వాళ్లు చేసే కొత్త సినిమాలకు ముడి పెట్టి నానా యాగీ చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.

ఆమిర్ ఖాన్ ఇలాగే ‘లాల్ సింగ్ చడ్డా’ విషయంలో అన్యాయం అయిపోయాడు. ఇప్పుడు సాయిపల్లవి సోషల్ మీడియాలో ఊహించని వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ‘విరాట పర్వం’ రిలీజ్ టైంలో గోవుల్ని తరలిస్తున్న ఓ ముస్లిం యువకుడి మీద హిందువులు దాడి చేయడాన్ని తప్పుబట్టింది. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో అంశాలతో పోలుస్తూ అక్కడ కశ్మీర్ పండిట్ల మీద దాడి తప్పయితే.. ఇక్కడ ముస్లింల మీద దాడి కూడా తప్పే కదా అని ఆమె ప్రశ్నించింది.

అప్పట్లో ఈ వ్యాఖ్యలపై కొంత వివాదం నడిచింది. తర్వాత సద్దుమణిగింది. కట్ చేస్తే ఇప్పుడు సాయిపల్లవి హిందీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీతారాములుగా రణబీర్ కపూర్, సాయిపల్లవిల ఆన్ లొకేషన్ ఫొటోలు కొన్ని లీక్ అయ్యాయి. ఈ సందర్భంగా సాయిపల్లవి మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సాయిపల్లవి సీత పాత్రకు సూట్ కాదని.. హిందువులు పవిత్రంగా భావించే సీత పాత్రను ఆమె ఎలా చేస్తుందని.. ఆమె సూడో సెక్యూరలిస్ట్ అని.. అప్పటి ఇంటర్వ్యూ విషయాలను ప్రస్తావిస్తూ తనను టార్గెట్ చేస్తున్నారు. నిన్న ఫొటోలు లీకయ్యాక మొదలైన ఈ ట్రెండ్ అంతకంతకూ ఊపందుకుంటోంది. సాయిపల్లవి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ టీంలో గుబులు రేపుతోంది ఒక వర్గం. ఈ ట్రెండ్ చూస్తుంటే రిలీజ్ సమయానికి సినిమాను మరింతగా టార్గెట్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.