మర్చిపోయిన సినిమాకి ఇంతటి వివరణ అవసరమా?
ప్రభాస్ నటించిన `ఆదిపురుష్` విడుదలై ఫ్లాప్ షోగా మిగలడమే గాక, చాలా విమర్శల్ని తెచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 May 2025 9:41 AMప్రభాస్ నటించిన `ఆదిపురుష్` విడుదలై ఫ్లాప్ షోగా మిగలడమే గాక, చాలా విమర్శల్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాడని కూడా కథనాలొచ్చాయి. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. రామాయణ ఇతిహాసంలో పాత్రల్ని తప్పుగా చూపించారని విమర్శలొచ్చాయి. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ ఖాన్ రావణుడిగా నటించారు. సీత పాత్రలో కృతి సనోన్ నటించింది.
అయితే ఇందులో పాత్రల చిత్రణపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అదంతా అటుంచితే ఆదిపురుష్ విడుదలై అంత కాలం అయిన తర్వాత కూడా ఇది ఇంకా సైఫ్ లాంటి నటుడిని వెంటాడుతోంది. ఇటీవల రావణ్ పాత్రధారి సైఫ్ ఖాన్ మాట్లాడుతూ.. తన కుమారుడు తైమూర్ ఆదిపురుష్ సినిమాని ఓటీటీలో చూసాడని, తనకు ఎంతమాత్రం నచ్చలేదని అన్నారు. దీనికి తైమూర్ కు క్షమాపణ చెప్పానని కూడా సైఫ్ ఖాన్ వ్యాఖ్యానించాడు.
అయితే అతడి వ్యాఖ్యలు వెబ్ లో వేగంగా వైరల్ అయ్యాయి. దీనిపై ఒక సెక్షన్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తన వ్యాఖ్యల వెనక అసలు కారణాన్ని సైఫ్ వివరించే ప్రయత్నం చేసాడు. తన సినిమాని ఎంతమాత్రం తప్పు పట్టలేదని, అందులో తాను చెడ్డవాడి (విలన్) గా నటించినందుకు క్షమాపణలు చెప్పానని అన్నాడు. సినిమాలో దుష్ట విలన్గా ఉన్నందుకు నేను టిమ్(థైమూర్)కు క్షమాపణలు చెప్పాను. తెరపై నేను కేకలు వేస్తూ కనిపించిన ప్రతి ఒక్కరినీ చితక్కొట్టాను..! అని గుర్తు చేసుకున్నాడు. అయితే ఈసారి నువ్వు హీరోగా నటించాలని థైమూర్ కోరాడు. నా అన్ని చిత్రాలకు నేను మద్దతు ఇస్తున్నాను.. ఆదిపురుష్ కి కూడా! అని అన్నాడు.
ఆదిపురుష్ చిత్రంలో సైఫ్ రాక్షసరాజు రావణుడిగా నటించాడు. అతడి పాత్రను చిత్రీకరించిన విధానంపై విమర్శలొచ్చాయి. అయితే సైఫ్ ఆల్రెడీ ఫ్లాప్ గా మిగిలి, థియేటర్ల నుంచి వెళ్లిపోయిన సినిమాకి ఇంతటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. తైమూర్ తో కేవలం సరదా సంభాషణ సాగిందనే విషయాన్ని చెబితే సరిపోయేది కదా! అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.