పాత సినిమాలనూ వదలని బాలీవుడ్
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలను చూసి సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు టెక్నికల్ వ్యాల్యూస్, ఇతర మేకింగ్ పరిజ్ఞానంను నేర్చుకునే వారు.
By: Tupaki Desk | 23 April 2025 1:00 AM ISTఒకప్పుడు బాలీవుడ్ సినిమాలను చూసి సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు టెక్నికల్ వ్యాల్యూస్, ఇతర మేకింగ్ పరిజ్ఞానంను నేర్చుకునే వారు. కట్ చేస్తే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన ఒడిదొడుకుల మధ్య ఊగిసలాడుతోంది. ఎలాంటి కథలు తీస్తే అక్కడ ఆడుతాయో అర్థం కాని పరిస్థితి. పుష్ప 2 సినిమా హిందీలో దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసింది. కానీ ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా ఆ స్థాయి వసూళ్లను నార్త్ ఇండియాలో రాబట్టలేక పోయింది. హిందీ ప్రేక్షకులను మెప్పించడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో రూపొందుతున్న సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.
సౌత్ సినిమాలు నార్త్ ఇండియాలో రీమేక్ అవ్వడం ఈమధ్య కాలంలో కామన్ విషయం అయింది. కొన్ని సౌత్ సినిమాల రీమేక్లు హిందీలో భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్గా రీమేక్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇంకా పలు సినిమాలు ఈమధ్య కాలంలో హిందీలో రీమేక్ అయ్యి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సౌత్లో విజయాన్ని సొంతం చేసుకున్న కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తంగా బాలీవుడ్లో థియేటర్ రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో సౌత్ ఇండియన్ సినిమా రీమేక్కి బాలీవుడ్ రెడీ అయింది.
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ మధ్య కాలంలో హీరో పాత్రల కంటే ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఆయన తన కెరీర్ పూర్తిగా టర్న్ చేసుకున్నాడు అనుకుంటున్న సమయంలో అప్పుడప్పుడు హీరోగానూ సినిమాలు చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నాడు. 2016లో మోహన్లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన 'ఒప్పం' సినిమాను సైఫ్ అలీ ఖాన్ రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఒప్పం సినిమాలో మోహన్ లాల్ అంధుడిగా కనిపించాడు. ఇప్పుడు అదే పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేయబోతున్న నేపథ్యంలో మిశ్రమ స్పందన వస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న ఆ పాత్రకు సైఫ్ న్యాయం చేయగలడు. కానీ సినిమా రీమేక్ ఏ మేరకు ఫలితం సాధిస్తుంది అనేది నమ్మకంగా చెప్పలేమని అంటున్నారు.
పదేళ్ల క్రితం వచ్చిన ఒప్పం సినిమా అప్పట్లో కమర్షియల్గా పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది. మోహన్ లాల్ స్టార్డం కారణంగా జనాల్లోకి వెళ్లింది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఒప్పం సినిమాను ఇప్పుడు అదే దర్శకుడు హిందీలో రీమేక్ చేయబోతున్నాడు. ఒక జడ్జ్ కూతురును కిడ్నప్ చేస్తే గుడ్డివాడు అయిన హీరో ఎలా కాపాడాడు అనేది సినిమా కథ. సాధారణంగా హీరోలు గుడ్డి వారు అయితే స్క్రీన్ప్లే విభిన్నంగా ఉంటుంది. కానీ ఈ సినిమా కమర్షియల్ యాంగిల్లో దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించారు. మలయాళంలో పర్వాలేదు అనిపించుకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ హిందీలో ప్రేక్షకులను మెప్పిస్తాయా అనేది చూడాలి.
