Begin typing your search above and press return to search.

ఆ అరెస్టుతో నటి కుటుంబం చిన్నాభిన్నం

సీబీఐ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్‌లకు క్లీన్ చిట్ ఇస్తూ తుది నివేదికను దాఖలు చేయడంతో రియా పోరాటం చివ‌రికి ముగిసింది.

By:  Tupaki Desk   |   3 April 2025 11:02 PM IST
ఆ అరెస్టుతో నటి కుటుంబం చిన్నాభిన్నం
X

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకుని మ‌ర‌ణించాడ‌ని ఇటీవ‌లే తీర్పు వెలువ‌డింది. ఈ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న రియా చ‌క్ర‌వ‌ర్తికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. చివ‌రికి రియా నిర్ధోషి అని నిరూపించుకుంది. అయితే ఒక నిర్ధోషి, త‌న‌ను తాను నిరూపించుకునే లోపు ఆ కుటుంబం ఎంత‌టి తీవ్ర మాన‌సిక వేద‌న‌కు గురైందో, అరెస్టులు కోర్టులు కేసులు అంటూ తిరుగుతూ ఆ కుటుంబం ఎంత‌గా చిన్నాభిన్న‌మైందో రియా చ‌క్ర‌వ‌ర్తి స్నేహితురాలు నిధి య‌హిరానందాని వివ‌రించిన తీరు హృద‌యాల‌ను క‌ల‌చివేస్తోంది.

త‌న కూతురు కొడుకు అరెస్ట్ అయ్యార‌ని తెలుసుకున్న త‌ర్వాత వారి త‌ల్లి నేల‌పై కుప్ప‌కూలింది. అరిచి ఏడ్చిన త‌ర్వాత‌ త‌న గొంతు పోయింది. రియా తండ్రి పిచ్చోడిలా త‌మ‌కు స‌హాయం చేసేవారి కోసం వెతికారు. చాలా ఎదురు చూపులు చూసారు. అస‌లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో కుటుంబం అధ్వాన్నంగా మారింది. రియా చ‌క్ర‌వ‌ర్తిని, త‌న సోద‌రుడు సోయిక్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించారు. 23 ఏళ్ల సోయిక్ క్యాట్ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణత సాధించాడు. అతడికి ప్ర‌తిష్ఠాత్మ‌క కాలేజ్ ల‌లో సీట్ వ‌చ్చింది. కానీ జైలు జీవితం కార‌ణంగా అత‌డు తిర‌స్క‌ర‌ణ‌ల‌కు గుర‌య్యాడు. అప్ప‌టికే కెరీర్ ప‌రంగా ఎద‌గాల‌ని చూసిన రియా చ‌క్ర‌వ‌ర్తి నాశ‌న‌మైంది. అక్కా త‌మ్ముడు జైలుకు వెళ్ల‌గా, ఆ కుటుంబీకులంతా చిన్నాభిన్న‌మ‌య్యారు. తీవ్ర విచారంలోకి వెళ్లిపోయారు. రియా త‌ల్లి నేల‌కూల‌డం తాను ప్ర‌త్య‌క్షంగా చూసాన‌ని ఆ ఘ‌ట‌న‌ను మ‌ర్చిపోలేన‌ని నిధి అన్నారు.

సీబీఐ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్‌లకు క్లీన్ చిట్ ఇస్తూ తుది నివేదికను దాఖలు చేయడంతో రియా పోరాటం చివ‌రికి ముగిసింది. కోర్టు గొడ‌వ‌ల్లో ప‌డి జీవితాలు చిన్నా భిన్న‌మ‌య్యాయి. విలైవ‌న సంవ‌త్స‌రాల‌ను వారు కోల్పోయారు. సుశాంత్ సింగ్ -రియా జంట‌గా ప్రేమతో నిండి ఉన్నారు. అది ఒక అందమైన సంబంధం. వారిద్దరూ ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా నిలిచారు.. అని నిధి తెలిపారు.

ప్రియమైన సుశాంత్ సింగ్‌ని కోల్పోవడాన్ని జీర్ణించుకోవడానికి రియాకు, ఆమె కుటుంబానికి ఒక్క నిమిషం కూడా సమయం లేదని అనిపించింది. వారు షాక్ అయ్యారు, దుఃఖిస్తున్నారు. వారు ఈ మనుగడ మోడ్‌లోకి నెట్టబడ్డారు. వారు కూర్చుని సరిగ్గా దుఃఖించలేకపోయారని నిధి వెల్ల‌డించారు. మీడియా మైకులు రియా ముఖం, చేతుల‌కు గాయాలు చేసాయి. మేము కలిసి టీవీ చూస్తున్నాము.. నేను రియా త‌ల్లి ముఖాన్ని చూశాను. ఆమె నేలపై పడిపోయిన తీరు ఎప్పటికీ మర్చిపోలేను. అది వారి జీవితంలో అత్యంత వినాశకరమైన క్షణం అని నిధి నాటి ఘ‌ట‌న‌ను వివ‌రించారు.