Begin typing your search above and press return to search.

ఇంకెన్ని సినిమాలు రీ-రిలీజ్ చేస్తారండీ బాబూ!

టాలీవుడ్ లో రీ-రిలీజుల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలను, కల్ట్ క్లాసిక్ సినిమాలను 4K రెజల్యూషన్ లో మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ వస్తున్నారు

By:  Tupaki Desk   |   21 Feb 2024 10:39 AM GMT
ఇంకెన్ని సినిమాలు రీ-రిలీజ్ చేస్తారండీ బాబూ!
X

టాలీవుడ్ లో రీ-రిలీజుల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలను, కల్ట్ క్లాసిక్ సినిమాలను 4K రెజల్యూషన్ లో మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ వస్తున్నారు. హీరోల బర్త్ డే స్పెషల్ గానో, మరేదైనా ప్రత్యేకమైన రోజుల్లోనో రీ రిలీజ్ చేసే చిత్రాలను జనాలు బాగానే ఆదరించారు. మంచి వసూళ్లను అందించారు. 'పోకిరి'తో మొదలైన ఈ ట్రెండ్ కొన్నినెలల పాటు పీక్స్ స్టేజిలో నడిచింది. అయితే ఫ్లాప్ సినిమాల్ని కూడా మళ్లీ విడుదల చేస్తుండటంతో, ఓ దశలో వీటిపై ప్రేక్షకులకు మొహం మొత్తింది. దీంతో ఈ ట్రెండ్ కు బ్రేక్ పడుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే, అది ఇప్పుడప్పుడల్లా జరిగేలా కనిపించడం లేదు.

ఇటీవల 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాని 'యాత్ర 2'కు పోటీగా రీ-రిలీజ్ చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న డజను పాత చిత్రాలను విడుదల చేశారు. 'ఓయ్', 'తొలిప్రేమ' సినిమాలతో పాటుగా.. రెండేళ్ల క్రితం వచ్చిన 'సీతారామం', గతేడాది హిట్టయిన 'బేబీ' చిత్రాలని కూడా రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఆగస్టులో రీరిలీజ్ చేసిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మూవీని, ఆరు నెలలు తిరక్కుండానే మరోసారి థియేటర్లలో తీసుకొచ్చారు. రీసెంట్ గా ఫిబ్రవరి 17, 18 తేదీలలో 'వర్షం' సినిమా స్పెషల్ షోలు వేశారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' మూవీని కూడా పలు థియేటర్లలో ప్రదర్శించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన 'సింహాద్రి' సినిమా 4K వెర్షన్ ను 2024 మార్చి 1న రీ-రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. గతేడాది ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తే, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఇంతలోనే మరోసారి విడుదల చేయడంపై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే మార్చి 1న మాస్ మహారాజా రవితేజ నటించిన 'కిక్' 4K సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'సమర సింహా రెడ్డి' సినిమా వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, మరోసారి సినిమా హాళ్ళలో ప్రదర్శించనున్నారు. ఇది మార్చి 2వ తేదీన విడుదల అవుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా.. మార్చి 23-24 తేదీల్లో 'నాయక్' సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఇక రవితేజ, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో రూపొందిన 'దుబాయ్ శీను' చిత్రాన్ని ఫిబ్రవరి 24-25 తేదీల్లో రీరిలీజ్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్.

ఇలా రీ-రిలీజ్ ట్రెండ్ లో భాగంగా రాబోయే రోజుల్లో మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. సమ్మర్ వరకూ భారీ చిత్రాల రిలీజులు లేకపోవడాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మంచి కలెక్షన్లు వస్తుండటం, 4K రెజల్యూషన్ లోకి మార్చడానికి పెద్దగా ఖర్చు అవ్వకపోవడంతో అందరూ ఇదే బాటలో పయనిస్తున్నారు. మరి ఈ ట్రెండ్ టాలీవుడ్ లో ఇంకెన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో చూడాలి.