Begin typing your search above and press return to search.

ఈ స్టార్‌ కపుల్‌ చాలా ఖరీదు గురూ..!

సినిమా స్టార్స్ వారి స్టార్‌డంను చూపించేందుకు, వారి విలాసవంతమైన జీవితాన్ని చూపించేందుకు ఖరీదైన కార్లలో తిరుగుతూ, పదుల కోట్ల విలువ చేసే ఇంట్లో నివాసం ఉంటారు.

By:  Tupaki Desk   |   17 April 2025 4:00 PM IST
ఈ స్టార్‌ కపుల్‌ చాలా ఖరీదు గురూ..!
X

సినిమా స్టార్స్ వారి స్టార్‌డంను చూపించేందుకు, వారి విలాసవంతమైన జీవితాన్ని చూపించేందుకు ఖరీదైన కార్లలో తిరుగుతూ, పదుల కోట్ల విలువ చేసే ఇంట్లో నివాసం ఉంటారు. ఒకప్పుడు షారుఖ్ ఖాన్‌ ఫ్యామిలీతో ఉండే ఇల్లు మన్నత్‌ రేటు చూసి అంతా షాక్‌ అయ్యేవారు. ముంబై మార్కెట్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మన్నత్‌ ప్రస్తుత రేటు దాదాపు రూ.225 కోట్లు. మన్నత్‌ కంటే ఖరీదైన ఇల్లు ముంబైలో చాలానే ఉన్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిలో ఆ స్థాయి ఇల్లు మరెవ్వరికీ లేదని చెప్పాలి. షారుఖ్ ఖాన్‌ ఇల్లే అతి ఖరీదైన ఇల్లు. వంద కోట్ల ఖర్చుతో ఇల్లు నిర్మించుకున్న వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు.

ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్వీర్‌ సింగ్‌, దీపికా పదుకునే తమ డ్రీమ్‌ హౌస్‌ను రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని అత్యంత ఖరీదైన ఏరియాలో, సముద్రానికి ఎదురుగా ఉండే విధంగా వీరు తమ ఇంటిని ఎంపిక చేసుకున్నారు. విలాసవంతమైన అపార్ట్మెంట్‌లో 16 నుంచి 19వ అంతస్తు వరకు వీరి ప్లాట్‌ విస్తరించి ఉంటుంది. ఈ క్వాడ్రాప్లెక్స్‌ ఇల్లు ఖరీదు దాదాపుగా రూ.100 కోట్లు ఉంటుందని మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు. ఈమధ్య కాలంలో బాలీవుడ్‌ స్టార్స్ ఈ స్థాయిలో ఖర్చు చేసి ఇల్లు కొనుగోలు చేయడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ఇల్లుకి త్వరలోనే మారబోతున్నారు.

ఇదే అపార్ట్‌మెంట్‌లో చాలా మంది బాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు నివాసం ఉంటున్నారట. ముఖ్యంగా మన్నత్‌ కి రిపేర్స్ చేయిస్తున్న షారుఖ్ ఖాన్‌ ఫ్యామిలీ ప్రస్తుతం ఇదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారని తెలుస్తోంది. సల్మాన్‌ ఖాన్‌కి సైతం ఈ అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ ఉందంటే కచ్చితంగా వారు ముంబైలోనే బిగ్‌ షాట్స్‌గా చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం రణ్వీర్ సింగ్‌, దీపికా పదుకునే నివాసం ఉంటున్న ఇల్లును 2021లో దాదాపు పాతిక కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశారు. ఇప్పుడు వీరికి ఒక పాప ఉంది. కనుక విలాసవంతమైన ఇల్లును వీరు కొనుగోలు చేసేందుకు సిద్ధం అయ్యారు.

దీపికా పదుకునే ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌. ఒక్కో సినిమాకు డేట్స్‌ను కేటాయించడం బట్టి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల పారితోషికం అందుకుంటూ ఉందట. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈమె తెలుగులో ప్రభాస్ మూవీ 'కల్కి 2898 ఏడీ' సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే. కల్కి సెకండ్‌ పార్ట్‌లో దీపికా పదుకునే పాత్ర పరిధి మరింత ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం దీపికా పదుకునే ప్రెగ్నెంట్‌గానే హాజరు అయింది. సినిమాలోనూ ఆమె ప్రెగ్నెంట్‌గా కనిపించడం విశేషం. హిందీలో ప్రస్తుతం ఈమె రెండు మూడు భారీ సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాలకు గాను భారీ పారితోషికం అందుకుంటోంది.