Begin typing your search above and press return to search.

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై వర్మ ఇలా..!

ఈ సమయంలో వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఆసక్తికరంగా స్పందించాడు. సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్న విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.

By:  Tupaki Desk   |   13 Jun 2025 10:10 AM
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై వర్మ ఇలా..!
X

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రమాదం గురించి చర్చ జరిగింది. ఇండియన్స్ మాత్రమే కాకుండా విదేశీయులు సైతం పెద్ద ఎత్తున మృతి చెందడంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఆసక్తికరంగా స్పందించాడు. సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్న విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.

రామ్‌ గోపాల్‌ వర్మ ఎక్స్‌లో... దేవుడు ఏం చేస్తున్నాడో దేవునికి తెలుసు? మీరు సెలవుల కోసం అందమైన ప్రదేశానికి వెళ్తే అక్కడ ఉగ్రవాదులు మిమ్మల్ని కాల్చి చంపేస్తారు, మీరు ఒక జట్టు విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం వెళ్తే అక్కడ తొక్కిసలాటలో చనిపోతారు, మీరు విమానంలో ఎగిరే సమయంలో విమానం కుప్పకూలి పోయి చనిపోతారు, చివరకు మీరు మీ హాస్టల్‌లో భోజనం చేస్తున్న సమయంలో ఒక విమానం వచ్చి మీపై పడి చనిపోతారు అంటూ యాక్ట్‌ ఆఫ్ గాడ్‌ గురించి, ఈ భూమి మీద మనిషి జీవితం గురించి వర్మ తనదైన శైలిలో ట్వీట్‌ చేశాడు. వర్మ ఏ ట్వీట్‌ చేసినా వివాదాస్పదంగా లేదా కాస్త లోతుగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది.

సందర్భానుసారంగా అందరికంటే విభిన్నంగా స్పందించడంలో వర్మ ముందు ఉంటారు అనడంలో సందేహం లేదు. అలాంటి వర్మ అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం జరిగిన కొన్ని గంటలకు ఈ ట్వీట్‌ చేయడం జరిగింది. మనిషి జీవితం అనేది ఎప్పుడు, ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అందుకే ఎంత వీలు అయితే అంత జీవించేయాలి, అంతగా ఎంజాయ్‌ చేయాలని చాలా మంది సోషల్‌ మీడియాలో వర్మ ట్వీట్‌కి కామెంట్‌ చేస్తున్నారు. ఇది వర్మ మాత్రమే కాకుండా చాలా మంది చాలా రకాలుగా షేర్‌ చేస్తున్నారు. చావు అనేది ఏ రూపంలో వస్తుందో ఊహించలేం. కనుక చనిపోతామని ముందు నుంచే భయపడవద్దని కొందరు అంటున్నారు.

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారు మాత్రమే కాకుండా ఏ సంబంధం లేని మెడికల్‌ స్టూడెంట్స్‌, స్థానికులు చనిపోవడం అత్యంత బాధాకర విషయం. విమాన ప్రమాధం నుంచి ఒకే ఒక్కడు బతికి బట్ట కట్టాడు. అతడు కచ్చితంగా మృత్యుంజయుడు, అయితే అదే ప్రమాదంలో అతడి సోదరుడు మృతి చెందాడు. ఎవరూ ఇష్టపడని విండో ఉండని ఎమర్జెన్సీ డోర్‌ వద్ద అతడు కూర్చోవడం వల్లే ఈ రోజు అతడు బతికాడు. అందుకే జీవితంలో ఏది ఎప్పుడు ఎలా వచ్చినా దాన్ని స్వీకరించాలని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాల్సిన సమయం ఇది.