మెగా కుటుంబం లండన్లో సర్ ప్రైజ్ వెనక?
తాజా సమాచారం మేరకు మ్యాడమ్ టుస్సాడ్స్ లో ఈ ప్రతిష్ఠాత్మక విగ్రహ ప్రారంభోత్సవానికి మెగా కుటుంబం లండన్ కి వెళ్లింది.
By: Tupaki Desk | 6 May 2025 4:08 AMప్రతిష్టాత్మక మ్యాడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో పలువురు భారతీయ సినీతారల మైనపు విగ్రహాలు కొలువు దీరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారందరి సరసనా రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటునకు సమయమాసన్నమైంది. గత అక్టోబర్ లోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. చరణ్ మైనపు విగ్రహాన్ని మే 9న ఆవిష్కరించనున్నారు. తాజా సమాచారం మేరకు మ్యాడమ్ టుస్సాడ్స్ లో ఈ ప్రతిష్ఠాత్మక విగ్రహ ప్రారంభోత్సవానికి మెగా కుటుంబం లండన్ కి వెళ్లింది.
ఇక రామ్ చరణ్ తో పాటు మైనపు విగ్రహంలో అతడి పెట్ డాగ్ రైమ్ కూడా ప్రధాన ఆకర్షణగా మారనుండడంతో అది అందరిలో ఉత్సాహం నింపుతోంది. క్వీన్ ఎలిజబెత్- 2 కాకుండా పెంపుడు జంతువుతో విగ్రహాన్ని కలిగి ఉండే ఏకైక ప్రముఖుడు చరణ్. దీనిపై అతడు మాట్లాడుతూ.. తాను లండన్ విజిట్ చేసినప్పుడల్లా అక్కడ మ్యాడమ్ టుస్సాడ్స్ లో ప్రముఖుల విగ్రహాలతో ఫోటోలు దిగేవాడిని అని.. తాను ఇంత తొందరగా అలాంటి లెజెండ్స్ సరసన చేరతానని భావించలేదని అన్నారు. మేడమ్ టుస్సాడ్స్ బృందం నా ప్రియమైన పెంపుడు జంతువు రైమ్ను నా బొమ్మతో చేర్చడం నిజంగా సంతోషంగా ఉంది. ఇది అర్థవంతమైనది. ఎందుకంటే ఇది నా పనికి, నా జీవితానికి మధ్య ఉన్న పరిపూర్ణతను చూపిస్తుంది. రైమ్ నా జీవితంలో పెద్ద భాగమని చరణ్ అన్నారు.
రామ్ చరణ్ విగ్రహాన్ని లండన్ లో ఆవిష్కరించిన అనంతరం దానిని సింగపూర్ టుస్సాడ్స్ కు తరలిస్తారు. ప్రస్తుతం ఈ ఆవిష్కరణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇంతకుముందు చరణ్ అమెరికా విజిట్ లో మెగాభిమానుల సందడి గురించి తెలిసిందే. ఇప్పుడు లండన్ లోను భారతీయ ఫ్యాన్స్ పోటెత్తడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మే 11న ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో మెగా కుటుంబం ఆర్.ఆర్.ఆర్ ప్రత్యేక లైవ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనను ఇవ్వనుంది. ఆస్కార్ విన్నింగ్ చిత్రబృందం ప్రత్యేక స్క్రీనింగ్కు హాజరవుతారు. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.