ఆ మూడు సినిమాలు డిస్ట్రిబ్యూటర్లని ముంచేశాయా?
ఇటీవల విడుదలైన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి', రాబిన్ హుడ్, జాక్ సినిమాలు కోటిన్నరకు కొంటే రూ.30 నుంచి రూ.40 లక్షలని కూడా రాబట్టలేకపోయాయని
By: Tupaki Desk | 14 May 2025 3:59 PMసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'బాబా' అప్పట్లో పెద్ద వివాదానికి తెర లేపింది. 'బాషా' ఫేమ్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై రజనీ కెరీర్లోకే అత్యంత భారీ డిజాస్టర్గా నిలిచి డిస్ట్రి బ్యూటర్లకు భారీ నష్టాలని తెచ్చిపెట్టింది. రజనీ సినిమా కావడంతో చాలా మంది డిస్ట్రి బ్యూటర్లు భారీ మొత్తాలకు ఈ సినిమాని కొన్నారు. అయితే వారు పెట్టిన పెట్టుబడిని కూడా 'బాబా' రాబట్టలేకపోవడంతో అంతా రజనీని కలవడం తెలిసిందే.
డిస్ట్రిబ్యూటర్లు తన సినిమా కారణంగా భారీగా నష్టపోవడంతో రజనీ ఆ మొత్తాన్ని తానే తిరిగి చెల్లించి వారిని కాపాడారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ల కలయికలో వచ్చిన 'అజ్క్షాతవాసి'కి ఇదే పరిస్థితి ఎదురైతే డిస్ట్రిబ్యూటర్లు నష్టాల నుంచి గట్టెక్కించాలని మేకర్స్ని, పవన్ని కోరడంతో కొంత వరకు రికవర్ చేశారు. ఇప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇదే పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల విడుదలైన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి', రాబిన్ హుడ్, జాక్ సినిమాలు కోటిన్నరకు కొంటే రూ.30 నుంచి రూ.40 లక్షలని కూడా రాబట్టలేకపోయాయని, దీని వల్ల కొన్న డిస్ట్రిబ్యూటర్లు కోటికి పైనే నష్టపోయారని సంచలన విషయాన్ని బయటపెట్టారు. అయితే ఈ మూడు సినిమాలతో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లలో 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' హీరో కల్యాణ్ రామ్ ఆదుకున్నారని, నష్టాలని తిరిగి చెల్లించారని, అయితే రాబిన్ హుడ్, జాక్ సినిమాలతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లని మాత్రం ఆ మేకర్స్ ఆదుకోలేదన్నారు.