మరో ప్రయోగానికి సిద్దమవుతున్న రాజశేఖర్
తాజాగా తమిళ్ మూవీని రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. తమిళ్ హిట్ మూవీ లబ్బర్ పందును రీమేక్ చేసేందుకు గాను రైట్స్ కొనుగోలు చేశాడని తెలుస్తోంది.
By: Tupaki Desk | 24 April 2025 7:16 AMఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో రాజశేఖర్. యాంగ్రీ యంగ్మన్గా గుర్తింపు దక్కించుకుని స్టార్డం సొంతం చేసుకున్న రాజశేఖర్ దశాబ్ద కాలంగా ఆశించిన స్థాయిలో సక్సెస్లను అందుకోలేక పోతున్నాడు. సీనియర్ హీరోల్లో చాలా మంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. వారి దారిలోనే రాజశేఖర్ సైతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేసినా అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. నితిన్ హీరోగా నటించిన ఒక సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. అది ఫెయిల్ అయింది. సినిమా మాత్రమే ఫెయిల్ కాకుండా రాజశేఖర్ పోషించిన పాత్ర కూడా ఫెయిల్ కావడంతో ఆలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది.
ఈ పదేళ్ల కాలంలో అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఏ ఒక్కటి కూడా ఆయనకు హిట్ తెచ్చి పెట్టడం లేదు. దాంతో ఆయన సినిమాలు చేయక పోవడం మంచిది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలతో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్కి పోటీగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి రాజశేఖర్ ఇప్పుడు మినిమం వసూళ్లు రాబట్టలేక పోతున్నాడు. అంతే కాకుండా ఆయనతో సినిమా అంటే రిస్క్ అని నిర్మాతలు భావించే స్థాయికి ఆయన క్రేజ్ పడిపోయింది. ఈమధ్య కాలంలో సినిమాలకు నాన్ థియేట్రికల్ రైట్స్ అత్యంత కీలకం.
రాజశేఖర్ నటించిన సినిమాలకు నాన్ థియేట్రికల్ రైట్స్ దారుణంగా నమోదు అయ్యాయి. ఆ మధ్య ఒక సినిమాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ఓటీటీ కూడా ముందుకు రాలేదట. దాంతో రాజశేఖర్ కెరీర్ పరంగా తీవ్ర ఒడిదొడకులు ఎదుర్కొంటున్నారు. సొంతగా కొన్ని సినిమాలను చేస్తూ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను అనిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా తమిళ్ మూవీని రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. తమిళ్ హిట్ మూవీ లబ్బర్ పందును రీమేక్ చేసేందుకు గాను రైట్స్ కొనుగోలు చేశాడని తెలుస్తోంది. తన వయసుకు తగ్గ పాత్రను ఆ రీమేక్లో చేయబోతున్నాడు.
పెళ్లి వయసుకు వచ్చిన కూతురు ఉన్న ఒక వ్యక్తికి క్రికెట్ అంటే చాలా ఇష్టం.. ఆ అమ్మాయిని ఇష్టపడే కుర్రాడికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ప్రేమ కథతో పాటు, క్రికెట్ నేపథ్యంలో సాగే లబ్బర్ పందుకి తమిళనాట మంచి ఆధరణ దక్కింది. అందుకే తెలుగులో దీన్ని రీమేక్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో రాజశేఖర్ ఉన్నాడని తెలుస్తోంది. కానీ ఆ సినిమాను ఇప్పటికే చాలా మంది ఓటీటీలో చూశారు. తెలుగు ప్రేక్షకులకు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు కాస్త తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చాలంటే కథ, కథనంలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి రాజశేఖర్ చేయబోతున్న ఈ సరికొత్త ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.