Begin typing your search above and press return to search.

SSMB29: జక్కన్న 'గ్లోబల్' ప్లాన్స్!

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 April 2024 5:30 PM GMT
SSMB29: జక్కన్న గ్లోబల్ ప్లాన్స్!
X

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇదొక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ. ప్రస్తుతానికి SSRMB, SSMB29 వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలవబడుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం దర్శకధీరుడు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఇండియన్ సినిమాగా కాకుండా, ఒక ఇంటర్నేషనల్ మూవీగా చెయ్యాలనే ఆలోచన చేస్తున్నారు.

బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన రాజమౌళి.. RRR చిత్రంతో గ్లోబల్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షించారు. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ సాధించిన తర్వాత స్టీవెన్ స్పీల్‌ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి హాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకొని తన తదుపరి చిత్రాన్ని నెక్ట్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.

మహేశ్ బాబుతో గ్లోబ్ ట్రాటనింగ్ మూవీ చేయబోతున్నట్లు రాజమౌళి ఇది వరకే ప్రకటించారు. ఇది తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని చెబుతూ వస్తున్నారు. దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి హాలీవుడ్ స్టూడియోలను ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగం చెయ్యాలని చూస్తున్నారట. ఇప్పటికే అనేక టాప్ కంపెనీలు ఈ సినిమాకి సహ నిర్మాతలుగా చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. ప్రస్తుతం మేకర్స్ ఈ డీల్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

SSMB29 భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించే మూవీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రముఖ హలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా భాగం కాబోతున్నాయి. డీల్ సెట్ అయిన తర్వాత అన్ని వివరాలు వెల్లడవుతాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జూన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో సెట్ చేయబడిన స్టోరీ కావడంతో, ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉంది. దాని కోసం రాజమౌళి అండ్ టీమ్ వివిధ లొకేషన్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు హీరో మహేష్ బాబు తన పాత్రకు కావలసిన లుక్‌ను రెడీ చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని స్టైలిష్ లుక్‌లో, సరికొత్తగా మేకవర్ అవ్వడానికి కృషి చేస్తున్నారు.

మహేష్ - రాజమౌళి చిత్రానికి కె విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా.. ఎస్ఎస్ కాంచి స్క్రిప్టు వర్క్ లో భాగం అవుతున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా, ఎస్ఎస్ కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు.