Begin typing your search above and press return to search.

బన్నీ సన్మాన వేళ.. టాలీవుడ్ పై ప్రకాశ్ రాజు పిడుగులు

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి చాలా దమ్ముండాలి.

By:  Tupaki Desk   |   23 Oct 2023 5:44 AM GMT
బన్నీ సన్మాన వేళ.. టాలీవుడ్ పై ప్రకాశ్ రాజు పిడుగులు
X

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి చాలా దమ్ముండాలి. ఎంత పెద్ద సీనియర్ అయితే మాత్రం.. ఎవరిని నొప్పించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొని.. నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోవటం చాలామందిలో కనిపిస్తుంటుంది. కానీ.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అలా కాదు. ఆయన చేతికి మైకు వచ్చిందంటే.. తన మనసులో ఏమేం అనుకుంటారో వాటిని మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు. తప్పు చేసేటోళ్లు ఎంతటి పెద్ద మనషులైనా పట్టించుకోరు. తన మాటలతో సంబంధాలు దెబ్బ తింటాయనో.. అవకాశాల మీద ప్రభావం చూపుతాయన్నది అస్సలు పట్టించుకోరు. తాజాగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవటం.. తెలుగు సినిమాలకు జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చిన నేపథ్యంలో మైత్రి మూవీస్ అధినేతలు ఒక పార్టీని ఏర్పాటు చేశారు.

ఇందులో బన్నీకి సన్మానం చేశారు. ఈ ప్రోగ్రాంకు హాజరైన ప్రకాశ్ రాజ్.. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై సంచలన కామెంట్లు చేశారు. ఎలాంటి మొహమాటాలకు గురి కాకుండా.. తప్పుల్నిఎత్తి చూపుతూ కడిగిపారేశారు. టాలీవుడ్ లో పలువురికి జాతీయ అవార్డులు దక్కటం.. తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయమని.. ఇలాంటి సందర్భంలో చిత్రపరిశ్రమలో అందరూ కలిసి రాకపోవటాన్ని ఆయన ప్రశ్నించారు.

‘‘జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ ను సన్మానించటానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావట్లేదు? బన్నీకి జాతీయ అవార్డు వస్తే.. అది తెలుగు సినిమా పరిశ్రమలోని వారందరికి గర్వ కారణం. రాజమౌళి మన తెలుగు సినిమాను అస్కార్ కు తీసుకెళితే.. అది తెలుగు పరిశ్రమకు.. తెలుగు వారందరికి గర్వకారణం. అలాంటిది బన్నీకి సన్మానం జరుగుతుంటే సినిమా పెద్దలు ఎందుకు రాలేదు’’ అంటూ కడిగేశారు.

అల్లు అర్జున్ మొదటి సినిమా చేస్తున్నప్పుడు.. అతడి కళ్లల్లో ఆకలిని చూశానని.. గంగోత్రి సినిమా షూటింగ్ వేళ.. అతడి నటనను చూసి.. ‘దిస్ బోయ్ విల్ గ్రో’ అని తాను అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘నేను బన్నీలో ఆకలిని చూశాను. బన్నీ ఈ రోజు ఉన్న చాలామంది యూత్ కు ఒక ఉదాహరణగా నిలిచారు. నీలో సంకల్పం ఉంటే.. నీ కళ్ల ముందు కళలు ఉంటే.. నువ్వు ధైర్యంగా కష్టపడితేనే పురస్కారాలు వస్తాయి. బన్నీకి జాతీయ అవార్డు వస్తే.. నా బిడ్డకు వచ్చినట్లుగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

తనకు తొలిసారి జాతీయ అవార్డు వచ్చినప్పుడు.. దాన్ని అందుకోవటానికి వెళ్లిన వేళలో.. తెలుగు సినిమా అంటే అక్కడి వారు తక్కువగా చూసేవారని.. ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడి అవార్డుతో పాటు.. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు తెలుగు వారికి రావటం గర్వంగా ఉందన్నారు. ‘‘మనకు అవార్డు వస్తేనే కాదు. మనవాళ్లకు అవార్డులు వచ్చినా మనకు వచ్చినట్లే. ఇక్కడికి చాలామంది యువ దర్శకులు వచ్చారు. కానీ.. ఇక్కడకు సినిమా పెద్దలు ఎందుకు రాలేదు? మన సినిమాలతో బౌండరీస్ దాటేస్తున్న వేళ.. అవతలి వాళ్ల కంటే మనవాళ్లను మనం గౌరవించుకోకపోతే ఎలా?’ అంటూ ప్రకాశ్ రాజ్ నోటి నుంచి వచ్చిన మాటలు పిడుగులు మాదిరి మారాయి. టాలీవుడ్ లో ఇప్పుడీ మాటలు ప్రకంపనలు రేపుతున్నాయి.