'డ్యూడ్' సినిమాతో అల్లు 'ఆర్య'కి సంబంధం ఏంటి?
తాజాగా దర్శకుడు కీర్తిశ్వరన్ తన మొదటి సినిమా డ్యూడ్ స్క్రిప్ట్ కి ఆర్య ప్రేరణగా నిలిచింది అని చెప్పడంతో ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలుస్తుందని మరో సారి నిరూపితం అయింది.
By: Ramesh Palla | 16 Oct 2025 12:02 PM ISTప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందిన డ్యూడ్ సినిమా దీపావళి సందర్భంగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తమిళ్ సినిమానే అయినప్పటికీ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన సినిమా కావడంతో ఇక్కడ భారీ రిలీజ్కి రెడీ అయింది. మైత్రి వారు తమకున్న బలంతో తెలుగు సినిమాల రేంజ్లోనే డ్యూడ్ సినిమాను విడుదల చేయడంకు ప్లాన్ చేశారు. డ్యూడ్ను తెలుగులో డైరెక్ట్ తెలుగు మూవీ అన్నట్లుగా ప్రచారం చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన డ్యూడ్ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ఇదో తెలుగు సినిమా అన్నట్లుగానే చెప్పుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు నచ్చుతుంది అంటూ హీరో ప్రదీప్ రంగనాథన్ హామీ ఇచ్చాడు.
డ్యూడ్ దర్శకుడు కీర్తిశ్వరన్..
ఈ సినిమా దర్శకుడు కీర్తిశ్వరన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా డ్యూడ్ సినిమా కథ, స్క్రిప్ట్, స్క్రీన్ప్లేకి ప్రేరణ తెలుగు సినిమా ఆర్య అంటూ ఆయన చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో ఆర్య ఒకటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెండ్ సెట్టర్ మూవీ అయిన ఆర్య కి తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా తమిళ ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ మంచి ఆధరణ, అభిమానం ఉంది. ఇప్పటికీ వేరు వేరు భాషల్లో ఆర్య సినిమా ఏదో ఒక ప్లాట్ఫామ్ పై స్ట్రీమింగ్ కావడం లేదా టెలికాస్ట్ కావడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా దర్శకుడు కీర్తిశ్వరన్ తన మొదటి సినిమా డ్యూడ్ స్క్రిప్ట్ కి ఆర్య ప్రేరణగా నిలిచింది అని చెప్పడంతో ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలుస్తుందని మరో సారి నిరూపితం అయింది. ట్రెండ్ సెట్టర్ మూవీ కనుక ఆర్య గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం.
ఆర్య సినిమా కథ ప్రేరణతో డ్యూడ్ సినిమా
కీర్తిశ్వరన్ ఇంకా మాట్లాడుతూ.. తనకు ఆర్య సినిమాపై ఉన్న అభిమానంను చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడూ ఆర్యను ప్రేమిస్తూనే ఉంటాను. డ్యూడ్ సినిమా కథ విషయంలో ఆర్య నుంచి ప్రేరణ పొందిన విషయాన్ని కాదనలేను అన్నాడు. తెలుగు వారితో ఎక్కువగా వర్క్ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నిర్మాతలు తెలుగు వారు కాగా, నా కెమెరామెన్ తెలుగు వాడే కావడంతో నా వర్క్ చాలా ఈజీ అయింది. నేను ఆకాశమే నీ హద్దు సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఆ సినిమా దర్శకులు సుధ కొంగర తెలుగు వారు అనే విషయం తెల్సిందే. అలా నాకు తెలుగుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముందు ముందు తెలుగులో సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లుగా కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో
మైత్రి మూవీ మేకర్స్ వారికి ఈ కథ చెప్పిన సమయంలో వెంటనే ఓకే చెప్పారు. సాధారణంగా ఏ నిర్మాతలు అయినా దర్శకుల వద్ద కథను పదే పదే చెప్పించుకుంటారు అని విన్నాను. కానీ మైత్రి వారికి నేను చెప్పిన కథ వెంటనే నచ్చింది. వారు పెద్ద సినిమాలు తీస్తారు, మంచి సినిమాలు తీస్తారు, అలాంటి వారి బ్యానర్లో నా మొదటి సినిమాను చేయడం చాలా సంతోషంగా ఉన్నాను. తప్పకుండా మైత్రి వారితో ముందు ముందు మైత్రి కొనసాగుతుందని నమ్ముతున్నాను అన్నాడు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటించగా కీలక పాత్రలో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతో ప్రదీప్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. తెలుగులోనూ ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అక్టోబర్ 17న డ్యూడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
