Begin typing your search above and press return to search.

ప‌ద్మ గ్ర‌హీత‌లు పొగాకు ఉత్ప‌త్తికి ప్ర‌చార‌మా?

పొగాకు బ్రాండ్ `విమల్`ను ఆమోదించినందుకు, ప్ర‌క‌ట‌న ద్వారా ప్ర‌మోట్ చేసినందుకు బాలీవుడ్ టాప్ స్టార్లు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ ల‌కు నోటీసులు అందాయి.

By:  Tupaki Desk   |   11 Dec 2023 6:20 AM GMT
ప‌ద్మ గ్ర‌హీత‌లు పొగాకు ఉత్ప‌త్తికి ప్ర‌చార‌మా?
X

పొగాకు బ్రాండ్ `విమల్`ను ఆమోదించినందుకు, ప్ర‌క‌ట‌న ద్వారా ప్ర‌మోట్ చేసినందుకు బాలీవుడ్ టాప్ స్టార్లు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ ల‌కు నోటీసులు అందాయి. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) ఈ నోటీసులను అందజేసిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బి పాండే అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు తాజాగా తెలియజేసారు. పొగాకు ప్ర‌చారంలో `ప‌ద్మ అవార్డు` గ్ర‌హీత‌లా? అంటూ కోర్టు, అధికారులు మొట్టికాయ‌లు వేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.

ప్ర‌జారోగ్యానికి హాని కలిగించే ప్రకటనలో బాలీవుడ్ స్టార్లు, పద్మ అవార్డు గ్రహీతలు న‌టించ‌డంపై ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయవాది మోతీలాల్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 20న నటులు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్ ధర్మాసనానికి తెలిపారు.

ఇటీవల అక్షయ్ కుమార్ విమల్ కొత్త ప్రకటన కోసం షారుఖ్ ఖాన్ -అజయ్ దేవగన్‌తో కలిసి ప‌ని చేసిన వీడియో వైర‌ల్ అయింది. నటి కం మోడల్ సౌందర్య శర్మ కూడా వాణిజ్య ప్రకటనలో భాగమైంది. అయితే, అక్షయ్ కుమార్ పొగాకు బ్రాండ్‌ను ప్రచారం చేయడం పై అభిమానులు పెద్దగా ఉత్సాహం చూపలేదు స‌రిక‌దా అత‌డిని తీవ్రంగా విమ‌ర్శించ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

సోషల్ మీడియాలో విమ‌ర్శ‌లు ఎదుర‌వ‌డంతో X మాధ్య‌మంలో అక్ష‌య్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అత‌డు వ్యాఖ్యానిస్తూ..``ఈ ప్రకటనలు 13 అక్టోబర్ 2021న చిత్రీకరించారు. ఎండార్స్‌మెంట్ నిలిపివేసినట్లు నేను బహిరంగంగా ప్రకటించినప్పటి నుండి నాకు బ్రాండ్‌తో ఎలాంటి సంబంధం లేదు. వారు ఇప్పటికే చిత్రీకరించిన ప్రకటనలను వచ్చే నెలాఖరు వరకు చట్టబద్ధంగా అమలు చేయగలరు`` అని తెలిపారు. అంతేకాకుండా అక్షయ్ కుమార్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు.