పద్మ భూషన్ కోసం ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్లిన స్టార్ హీరో!
ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగనుంది.
By: Tupaki Desk | 28 April 2025 6:58 AMఈ ఏడాది ఆరంభంలో ప్రకటించిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగనుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ భూషన్, పద్మ విభూషన్తో పాటు పద్మ అవార్డుల గ్రహీతలకు ప్రధానం చేయనున్నారు. 2025 జనవరిలో పలువురు సినిమా తారలు పద్మ అవార్డులకు ఎంపిక అయ్యారు. తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో అజిత్ పద్మ భూషన్ అవార్డ్కి ఎంపిక అయిన విషయం తెల్సిందే. ఆయన అభిమానులు ఆ సమయంలో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేశారు. పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. పద్మ భూషన్ అవార్డు వేడుక కోసం ఇప్పుడు అజిత్ కుమార్ తన ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ వెళ్లారు.
నేడు ఉదయం చెన్నై ఎయిర్ పోర్ట్లో అజిత్ కుమార్ ఆయన భార్య, పిల్లలు కలిసి ఢిల్లీ విమానం ఎక్కారు. అజిత్ ఎప్పటిలాగే కూల్ అండ్ హ్యాండ్సమ్ లుక్తో ఆకట్టుకున్నాడు. ఇక ఆయన భార్య షాలిని, కుమార్తె అనౌష, కుమారుడు ఆద్విక్ లతో పాటు ఫ్యామిలీ సన్నిహితులు ఢిల్లీ చేరుకున్నారు. అభిమానులు సైతం కొందరు ఢిల్లీకి వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. రాష్ట్రపతి భవన్లో నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అజిత్ కుమార్ పద్మ భూషన్ అవార్డ్ అందుకోవడంను చూడటం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ కార్యక్రమం టీవీల ద్వారా లైవ్లోనూ లక్షలాది మంది అభిమానులు చూడనున్నారు.
అజిత్ కుమార్ సినిమా రంగంలో చేసిన సేవకు గాను పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా ఆయన క్రీడా రంగంలోనూ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. రేసింగ్లో తన టీంతో దేశానికి గర్వించే విజయాలను అందించారు. ఇటీవల అంతర్జాతీయ రేసింగ్ కాంపిటీషన్లో నెం.2 స్థానంలో నిలవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమా రంగంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేయడంతో పాటు, ఎన్నో సేవా కార్యక్రమాలను తన అభిమానుల ద్వారా చేయించే అజిత్ పద్మ భూషన్ అవార్డుకు పూర్తి అర్హుడు అంటూ అభిమానులు చెబుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్న అజిత్ కుమార్కి ఈ అరుదైన ఘనత దక్కింది.
ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆరంభంలో విదామయుర్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా యావరేజ్గా నిలిచింది. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్లు వసూళ్లు అయినట్లు తెలుస్తోంది. అజిత్ నుంచి భారీ బడ్జెట్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన నటించిన సినిమా సూపర్ హిట్ అయితే ఈజీగా రూ.500 కోట్ల వసూళ్లు నమోదు కావడం ఖాయం. ఆ సాలిడ్ సక్సెస్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.