'దేవర' తరహా ప్లాన్తో ఎన్టీఆర్ 'వార్'..?
ఎన్టీఆర్ 'వార్ 2' తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద విడుదల అయిన విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 7 July 2025 12:00 PM ISTఎన్టీఆర్ 'వార్ 2' తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద విడుదల అయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని కొమురం భీమ్ పాత్రతో హిందీ ప్రేక్షకులను మెప్పించాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత దేవర సినిమాతో బాలీవుడ్లో మరోసారి సత్తా చాటాలని భావించాడు. కానీ దేవర థియేట్రికల్ రిలీజ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన క్రేజ్ ఖచ్చితంగా కంటిన్యూ కావడం ఖాయం అనే ధీమాతో ఎన్టీఆర్ అభిమానులు బాలీవుడ్ ఎంట్రీపై ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో భారీ స్పై థ్రిల్లర్గా రూపొందిన వార్ 2 సినిమాను ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన నేపథ్యంలో సహజంగానే ఉత్తర భారతంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ అయింది. తద్వారా అక్కడ సాలిడ్ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక సౌత్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దేవర సినిమా యావరేజ్ టాక్ దక్కించుకున్నప్పటికీ అత్యధిక స్క్రీన్స్ లో సినిమాను విడుదల చేసిన కారణంగా మొదటి వీకెండ్లో భారీ ఓపెనింగ్స్ నమోదు చేసిన విషయం తెల్సిందే.
దేవర సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 550 మిడ్ నైట్, బెనిఫిట్ షో లు వేయడం జరిగింది. దాంతో ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ను దేవర దక్కించుకున్న విషయం తెల్సిందే. బాక్సాఫీస్ వద్ద దేవర భారీ వసూళ్లు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించింది ఖచ్చితంగా రిలీజ్ ప్లాన్ అనడంలో సందేహం లేదు. సరైన రిలీజ్ దక్కిన కారణంగానే సినిమా ఓపెనింగ్స్ భారీగా నమోదు అయ్యాయి. దేవర సినిమా తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వార్ 2 ను దాదాపుగా 550 నుంచి 600 ప్రత్యేక షో లు ప్లాన్ చేస్తున్నారు.
తెలంగాణ లో మిడ్ నైట్ షో లు, ఎర్లీ మార్నింగ్ షో లకు అనుమతి పొందేందుకు గాను చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా టికెట్ల రేట్ల పెంపు విషయమై విజ్ఞప్తి చేసేందుకు నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. ఏపీలో ఖచ్చితంగా అనుకున్నన్ని షో లు పడే అవకాశం ఉంది, అంతే కాకుండా టికెట్ల రేట్ల విషయంలోనూ మేకర్స్కి పాజిటివ్ గా ప్రభుత్వం వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రత్యేక షో లు పడే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే కనుక నిజం అయితే కచ్చితంగా నార్త్ తో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక వసూళ్లు నమోదు అయినా ఆశ్చర్యం లేదని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.
