Begin typing your search above and press return to search.

నాని సినిమాకు ఆ డేట్ 'సరిపోదా'?

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "సరిపోదా శనివారం".

By:  Tupaki Desk   |   13 Feb 2024 10:45 AM GMT
నాని సినిమాకు ఆ డేట్ సరిపోదా?
X

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "సరిపోదా శనివారం". ‘అంటే సుందరానికి’ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ & టైటిల్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని, ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. దీని కోసం ఇప్పటికే ఒక రిలీజ్ డేట్ ను అనుకోగా.. ఇప్పుడు లేటెస్టుగా మరో కొత్త డేట్ ను లాక్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

'దేవర' సినిమా వాయిదా పడుతుందని తెలిసిన తర్వాత, టాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు జరిగే పరిస్థితి ఏర్పడింది. అలాంటి టైంలో 'సరిపోదా శనివారం' చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయినట్లుగా ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. అయితే ఆల్రెడీ అదే తేదీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప: ది రూల్' సినిమాని విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. చెప్పన సమయానికి వస్తామని సుక్కు అండ్ టీమ్ ధీమాగా షూటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాని సినిమా కోసం సెకండ్ ఆప్షన్ గా ఆగష్టు 29వ తేదీని పరిశీలిస్తున్నారట.

అన్నీ అనుకున్నట్లుగా జరిగి 'పుష్ప 2' సినిమా ఇండిపెండెన్స్ డేకి థియేటర్లలోకి వస్తే, 'సరిపోదా శనివారం' మూవీని ఆగష్టు 29వ తేదీన థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. ఒకవేళ సుకుమార్ - బన్నీల సినిమా పోస్ట్ పోన్ అయితే మాత్రం, ముందుగా ప్లాన్ చేసినట్లు ఆగష్టు 15నే విడుదల చేసే యోచన చేస్తున్నారట. ఏదేమైనా తప్పకుండా ఈ రెండు తేదీల్లోనే నాని చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

'దసరా', 'హాయ్ నాన్న' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నాని నుంచి రాబోతున్న చిత్రం 'సరిపోదా శనివారం'. ఇది ఆయన కెరీర్ లో 31వ చిత్రం. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్.జె సూర్య విలన్ గా కనిపించనున్నారు. జేక్స్ బెజాయ్ సంగీతం సమకూరుస్తుండగా.. మురళీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య నిర్మిస్తున్నారు.

'సరిపోదా శనివారం' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ ఎంటర్టైనర్లు, రొమాంటిక్ లవ్ స్టోరీలనే తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ.. ఈసారి విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌ ను రూపొందిస్తున్నారు. అందుకే ఈ చిత్రంపై ట్రేడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ తో పాటుగా నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం.

నెట్‍ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ రూ. 40 కోట్లకు పైగా చెల్లించి అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది నాని కెరీర్లోనే బిగ్ ఓటీటీ డీల్‍గా చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‍ రాజుకు చెందిన చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ మధ్యనే ఈ విషయాన్ని అఫిషియల్ గా వెల్లడించారు.