Begin typing your search above and press return to search.

అందుకే నాన్న విగ్రహం చూడలేదు : నాగార్జున

విగ్రహం చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంది. అందుకే నాన్న గారి విగ్రహాన్ని వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించే వరకు చూడలేదని అన్నారు నాగార్జున.

By:  Tupaki Desk   |   20 Sep 2023 1:33 PM GMT
అందుకే నాన్న విగ్రహం చూడలేదు : నాగార్జున
X

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో ఏఎన్నార్ నట వారసుడు నాగార్జున మాట్లాడుతూ శిల్పి వినీత్ అద్భుతంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారని అన్నారు. తనకు ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే ఆ గొప్ప వ్యక్తి ఇప్పుడు మనతో లేరు అనే భావన కలుగుతుంది. చిన్నప్పటి నుంచి నా మనసులో ఆ ముద్ర పడిపోయింది. విగ్రహం చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంది. అందుకే నాన్న గారి విగ్రహాన్ని వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించే వరకు చూడలేదని అన్నారు నాగార్జున.

నాన్న గారు లేరనేది యాక్సప్ట్ చేయాలని లేదు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని గడిపారు. మీ అందరికీ నాన్న గారు అద్భుతమైన నటుడు, తరతరాలు గుర్తు పెట్టుకునే పాత్రలు చేసిన నటుడు కోట్లమంది తెలుగు ప్రజలు ప్రేమించిన వ్యక్తని అన్నారు. మాకు మాత్రం నాన్న గారు మా గుండెలను ఆయన ప్రేమతో నింపారు. చిరునవ్వుతో మమ్మల్ని పిలిచే వ్యక్తి ఆయన. సంతోషాన్ని బాధను ఆయనతోనే పంచుకునే వాళ్లం. ఆయనతో కూర్చుంటే అన్ని బాధలు మాయమయ్యేవని అన్నారు నాగార్జున.

అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఆయనకు చాలా ఇష్టం. నచ్చిన స్థలంలో విగ్రహం పెడితే ప్రాణ ప్రతిష్ట చేసినట్టు అంటారు. అందుకే ఆయనకు ఇష్టమైన ప్లేస్ లో విగ్రహాన్ని ఆవిష్కరించామని అన్నారు నాగార్జున. ఆయన ప్రాణంతో మా మధ్యలో నడుస్తున్నారని అనుకుంటున్నామని అన్నారు. నాన్న గారు మన అందరి మనసుల్లో జీవించే ఉంటారు. మా కుటుంబానికి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడు గారు. ఎప్పుడు ఆహ్వాహించినా సరే ఆయన తప్పకుండా వస్తారు. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు నాగార్జున.

ఘనంగా జరిగిన ఈ వేడుకకు సినీ ప్రముఖులు మహేష్ బాబు, నమ్రత, రామ్ చరణ్, మోహన్ బాబు, ఎస్.ఎస్ రాజమౌళి, కీరవాణి, అల్లు అరవింద్, అశ్వినీదత్, దిల్ రాజు, సుబ్బిరామిరెడ్డి, మంచు విష్ణు, మురళీ మోహన్, బ్రహ్మానందం, శ్రీకాంత్, జయసుధ, నాగ వంశీ, చినబాబు, వైవిఎస్ చౌదరి, జెమిని కిరణ్ అనుపం ఖేర్ నాజర్ వంటి వాళ్లు పాల్గొన్నారు. అక్కినేని ఫ్యామిలీ సభ్యులంతా కూడా ఏఎన్నార్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆవిష్కరించిన ఏఎన్నార్ విగ్రహం ఆకర్షణగా నిలిచింది.