ఆ ఇద్దరు స్టార్ల కోసం `మైత్రీ`లో టెన్షన్!
బ్లాక్ బస్టర్ హిట్ని సొంత చేసుకున్న హీరో నుంచి సినిమా వస్తోందంటే ఉండే సందడే వేరు.
By: Tupaki Desk | 10 April 2025 5:47 AMబ్లాక్ బస్టర్ హిట్ని సొంత చేసుకున్న హీరో నుంచి సినిమా వస్తోందంటే ఉండే సందడే వేరు. అదే హీరో సినిమా క్రేజీ ప్రొడక్షన్ కంపనీ నుంచి రిలీజ్ అవుతోందంటే ఆ బజ్ మామూలుగా ఉండదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇద్దరు క్రేజీ స్టార్లు నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటికి సంబంధించిన బజ్ మాత్రం ఎక్కడా కనిపించక పోవడంతో సదరు నిర్మాణ సంస్థ టెన్షన్ పడుతూ పాజిటివ్ టాక్ కోసం ప్రార్థిస్తుండటం పలువురని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఆ సంస్థ మరేదో కాదు `పుష్ప 2` లాంటి సంచలన బ్లాక్ బస్టర్ని అందించిన మైత్రీ మూవీ మేకర్స్. త్వరలో `పుష్ప 3` కోసం రెడీ అవుతున్న ఈ సంస్థ ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో `జాట్` మూవీని నిర్మించింది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా గురువారం తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలైంది. ఈ మూవీతో పాటు మైత్రీ వారు తమిళ స్టార్ హీరో అజిత్ తోనూ `గుడ్ బ్యాడ్ అగ్లీ` పేరుతో భారీ సినిమా చేశారు.
అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. త్రిష హీరోయిన్ నటించింది. ఈ రెండు సినిమాలు ఇదే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఈ రెండింటికి తెలుగులో జీరో బజ్. కారణం మైత్రీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోవడమే. `జాట్`కు కొంతలో కొంత ప్రమోషన్స్ అయినా చేశారు కానీ `గుడ్ బ్యాడ్ అగ్లీ`కి మాత్రం జీరో పబ్లిసిటీ. అదే ఈ రెండు సినిమాలకు తెలుగు మార్కెట్లో ప్రధాన మైనస్గా మారింది. పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఈ సినిమాలని కాపాడటం కష్టం.
దీంతో మేకర్స్ ఫస్ట్ డే ఫస్ట్ షోకు పాజిటివ్ టాక్ రావాలని ప్రార్థిస్తున్నారట. సన్నీతో చేసిన `జాట్` పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారీ బడ్జెట్తో చేసిన ఈ సినిమా ఓపెనింగ్ డే రోజు రూ.10 కోట్లు కూడా రాబట్టడం కష్టం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక `గుడ్ బ్యాడ్ అగ్లీ` తెలుగు మార్కెట్ని పక్కన పెడితే అజిత్కు తమిళంలో భారీ క్రేజ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అని తెలుస్తోంది.