Begin typing your search above and press return to search.

'డబుల్ ఇస్మార్ట్'కు బూస్ట్ ఇచ్చిన మస్క్

ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్.. రియల్ లైఫ్ 'ఇస్మార్ శంకర్'ను రెడీ చేయించాడు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 11:29 AM GMT
డబుల్ ఇస్మార్ట్కు బూస్ట్ ఇచ్చిన మస్క్
X

పూరి జగన్నాథ్‌కు చాలా ఏళ్ల తర్వాత మంచి విజయాన్నందించిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. యువ కథానాయకుడు రామ్‌కు అది కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పూరి ఎప్పుడూ తీసే రెగ్యులర్ మాఫియా కథలను పక్కన పెట్టి.. ఒక వెరైటీ ఐడియాతో ఈ సినిమా చేశాడు. అందులో హీరో మెదడులో బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ చేస్తారు. దాని ద్వారా చనిపోయిన వ్యక్తి తాలూకు రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాని చుట్టూ థ్రిల్లింగ్ డ్రామాను నడిపాడు పూరి. ఒక కమర్షియల్ సినిమాలో ఇలాంటి ఐడియాను చూడటం అరుదే. విశేషం ఏంటంటే.. ఆ సినిమాలో చూపించిన క్రేజీ ఐడియానే ఇప్పుడు నిజం కాబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్.. రియల్ లైఫ్ 'ఇస్మార్ శంకర్'ను రెడీ చేయించాడు.

ఒక మనిషి మెదడులో బ్రెయిన్ చిప్ ఏర్పాటు చేయడం.. సంబంధిత ప్రాథమిక ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లు మస్క్ ఇటీవలే ప్రకటించడం చర్చనీయాంశం అయింది. ఈ ప్రయోగం ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ చేస్తున్న పూరి-రామ్‌లకు మంచి బూస్ట్ ఇచ్చే విషయమే. గత ఏడాదే ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో వీరి కలయికలో సీక్వెల్ పట్టాలెక్కింది. ప్రస్తుతం షూటింగ్ మధ్య దశలో ఉంది. ఈ సినిమా కథ కూడా ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీ మీదే నడుస్తుందని సమాచారం. మస్క్ తాజా ప్రకటన నేపథ్యంలో కథలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశముంది. మార్చిలోనే ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ అనుకున్నారు కానీ.. షూటింగ్ కొంత ఆలస్యం అవుతుండడంతో వేసవి చివర్లో విడుదల ఉండొచ్చని అంటున్నారు. ఛార్మితో కలిసి పూరీనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.