Begin typing your search above and press return to search.

సమ్మర్ ను క్యాష్ చేసుకునే కుర్ర హీరోలెవరు?

ఈ నేపథ్యంలో ఇప్పుడు వేసవి సెలవులను క్యాష్ చేసుకోవడానికి చిన్న, మీడియం రేంజ్ హీరోలు వస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 March 2024 3:15 AM GMT
సమ్మర్ ను క్యాష్ చేసుకునే కుర్ర హీరోలెవరు?
X

ఈ ఏడాది సమ్మర్ లో పెద్ద సినిమాల రిలీజులేవీ లేవు. మే నెలలో ప్రభాస్ 'కల్కి 2898 AD' సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కానీ, ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వాయిదా పడే అవకాశాలే ఎక్కువ అని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వేసవి సెలవులను క్యాష్ చేసుకోవడానికి చిన్న, మీడియం రేంజ్ హీరోలు వస్తున్నారు. మండుటెండల్లో ప్రేక్షకులకు సరికొత్త సినీ వినోదాన్ని అందించడానికి సిద్ధమయ్యారు. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీవిష్ణు, అల్లరి నరేష్ లాంటి హీరోలు ఈసారి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు.

శ్రీ విష్ణు - ఓం భీమ్ బుష్:

టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు ''ఓం భీమ్ బుష్'' సినిమాతో ఈ సీజన్ ను మొదలు పెట్టబోతున్నారు. 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్.. శుక్రవారం (మార్చి 22) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. చాలా కాలంగా కామెడీ సినిమాలకు మొహంవాచి ఉన్న జనాలకు ఇది పొట్టచెక్కలయ్యే వినోదాన్ని అందించబోతోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించారు.

సిద్ధు జొన్నలగడ్డ - టిల్లు స్క్వేర్:

శ్రీ విష్ణు వచ్చిన వారానికి స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ''టిల్లు స్క్వేర్'' మూవీతో థియేటర్స్ లోకి రాబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ ఇది. మల్లిక్ రామ్ దీనికి దర్శకుడు. నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ట్రైలర్, సాంగ్స్ తోనే యూత్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ్ దేవరకొండ - ఫ్యామిలీ స్టార్:

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందుతున్న చిత్రం ''ఫ్యామిలీ స్టార్''. సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురామ్ పెట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. 'గీతగోవిందం' తర్వాత దర్శక హీరోల కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టిల్లు వచ్చిన వారం రోజుల తర్వాత, ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది.

విశ్వక్ సేన్ - గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి:

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి''. 'ఛల్ మోహన్ రంగ' ఫేం కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో 'డీజే టిల్లు' భామ నేహా శెట్టి హీరోయిన్‌ గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ మంచి బజ్ తెచ్చిపెట్టింది. సమ్మర్ స్పెషల్ గా మే 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అప్పటికి ఎలక్షన్స్ కూడా పూర్తవడం ఈ మూవీకి కలిసొచ్చే మరో అంశం.

అల్లరి నరేష్ - ఆ ఒక్కటీ అడక్కు:

అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''ఆ ఒక్కటీ అడక్కు''. మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ను రాజీవ్ చిలక నిర్మించారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 22న రిలీజ్చెయ్యాలని అనుకున్నారు కానీ, చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఇది ఈ సమ్మర్ లోనే థియేటర్లలో సందడి చేయనుంది. త్వరలోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.

ఇలా ఐదుగురు మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలు ఈసారి సమ్మర్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. వీరి మధ్యలో అంజలి తన ''గీతాంజలి మళ్లీ వచ్చింది'' సినిమాతో ఆడియెన్స్ ముందుకి వస్తోంది. 'గీతాంజలి' సీక్వెల్ గా తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రం ఏప్రిల్ 11న విడుదల అవుతుంది. సుహాస్ హీరోగా నటించిన 'ప్రసన్న వదనం' సినిమా మే 3న రిలీజ్ కానుంది. అలానే దిల్ రాజు ప్రొడక్షన్ లో ఆయన నటించిన మూవీ కూడా మే 24న థియేటర్లలోకి రానుంది. మరి వీటిలో ఏయే చిత్రాలు వేసవి సీజన్ ను క్యాష్ చేసుకుని, బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటాయో చూడాలి.