Begin typing your search above and press return to search.

మెగాస్టార్ @45 ఏళ్లు!

మెగా మ‌హారాజు మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమా నుల్ని సంపాదించుకున్న ఓ గొప్ప లెజెండ్

By:  Tupaki Desk   |   22 Sep 2023 11:30 AM GMT
మెగాస్టార్ @45 ఏళ్లు!
X

మెగా మ‌హారాజు మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఓ గొప్ప లెజెండ్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకొచ్చి స్టార్ గా ఎదిగిన న ఓ న‌ట శిఖ‌రం. ఎన్టీఆర్ ..ఏఎన్నార్...సూప‌ర్ స్టార్ త‌రం త‌ర్వాత త‌రం నటుల్లో అంత గొప్ప స్థాయికి చేరింది మెగాస్టార్ మాత్ర‌మే. అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో తీవ్ర‌మైన పోటీ ఉన్న‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఓ స్థానం ఉంద‌ని ప్ర‌య‌త్నించి స‌క్సెస్ అయిన న‌టుడు.


శివ శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గా ప్ర‌స్థానం మొద‌లు పెట్టి మెగాస్టార్ గా ఎదిగిన వైనం ఎంతో మందికి స్పూర్తి. ఆయ‌న్ని ఆద‌ర్శంగా తీసుకుని సినీ రంగంలో రాణిస్తున్న వారెంతో మంది. నేటితారానికి మెగాస్టార్ స్పూర్తిగా నిలుస్తున్నారు. దాదాపు నాలుగు ద‌శాబ్ధాలుగా తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. మ‌ధ్య‌లో రాజ‌కీయాలం టూ అటువైపు ఓ అడుగు వేసినా! నా జీవితం ఇది కాదు... అభిమానుల్ని అల‌రించ‌డ‌మే అని మ‌ళ్లీ తిరోగ‌మ‌నం చెంది ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లోకే వ‌చ్చేసారు. ఈ ఏడాదితో మెగాస్టార్ సీని జీవితం మొద‌లై 45 వ‌సంతాలు పూర్త‌వుతుంది.

తెలుగు చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ని శ్వాసించి..శాషిస్తోన్న చిరంజీవి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న క‌ష్టంతో ఎదిగిన న‌టుడు కాదు..ఇష్టంతో ఎదిగిన న‌టుడు. అందుకే ఆ స్థాయికి చేరుకున్నారు. 'పునాది రాళ్లు' నుంచి మొన్న‌టి 'భోళా శంక‌ర్' వ‌ర‌కూ అన్న‌య్య జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలున్నాయి. సాధార‌ణ శివ శంక‌ర ప్ర‌సాద్ మెగాస్టార్ చిరంజీవిగా మారాడంటే దాని వెనుక ఎంతో క‌ష్టం..కృషి ప‌ట్టుద‌ల ఉన్నాయి.

చిన్న‌త‌నం నుంచి సినిమాలంటే ఆస‌క్తి. ఆ ఫ్యాష‌న్ తోనే చ‌దువు పూర్తిచేసుకుని 1976 లో చెన్నై వెళ్లి అక్క‌డే న‌ట‌న‌లో మ‌ద్రాస్ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ లో శిక్ష‌ణ తీసుకున్నారు. 1978లో 'పునాది రాళ్లు' సినిమాతో హీరోగా మారారు. కానీ ఈ సినిమా కంటే ముందు 'ప్రాణం ఖరీదు' అనే సినిమా రిలీజ్ అయ్యింది. అటుపై బాపు దర్శకత్వంలో వచ్చిన 'మనవూరి పాండవులు' సినిమాతో చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది.

మెగాస్టార్ కాక ముందు చిరంజీవి మంచి ప్ర‌తినాయ‌కుడు కూడా. 1976 లో 'ఐల‌వ్ యూ' అనే సినిమాలో నెగిటివ్ పాత్ర‌లో న‌టించారు. ఆ ఏడాది చిరంజీవి న‌టించిన 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ త‌ర్వాత మెగాస్టార్ వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ఎన్టీఆర్..కృష్ణ‌..ఏఎన్నార్ లాంటి స్టార్లు ఉన్నా చిరంజీవి త‌న‌దైన మార్క్ తో దూసుకుపోయారు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. వెండి తెర‌పై ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అందుకున్నారు.

'సైరా న‌ర‌సింహారెడ్డి' లాంటి పాత్ర‌తో కొంత వ‌ర‌కూ త‌న డ్రీమ్ రోల్ ని ఫుల్ ఫిల్ చేసుకున్నారు. కానీ అది ఆయ‌న్ని పూర్తి స్థాయిలో సంతృప్తి ప‌రచ‌లేదు. మెగా రేంజ్ హిట్ ని ఆ చిత్రం అందుకోలేదు. దీంతో మ‌న‌సులో ఆ కోరిక ఇంకా అసంపూర్ణంగానే ఉంది. రాజులు..రాజ‌రికాల నేప‌థ్యం గ‌ల సినిమాలు చేయాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. ఓ గొప్ప యుద్ద వీరుడి క‌థ‌లో న‌టించాల‌ని ఎదురు చూస్తున్నారు. అలాంటి క‌థ‌తో మెగాస్టార్ ని మెప్పించ‌గ‌ల్గితే త‌న సొంత నిర్మాణ సంస్థ‌లోనే భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌డానికి మెగాస్టార్ సంసిద్దంగా ఉన్నారు. ప్ర‌స్తుతం 157వ సినిమాని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేం మ‌ల్లిడి వ‌శిష్ట తెర‌కెక్కిస్తున్నారు.