Begin typing your search above and press return to search.

ఇందిరా గాంధీ ప్రభుత్వంపై మనోజ్ కుమార్ కేసు ఎందుకు వేశారు?

ప్రారంభంలో ఇందిరా గాంధీ, మనోజ్ కుమార్ మధ్య అంతా బాగానే ఉండేది. అయితే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   4 April 2025 5:17 AM
ఇందిరా గాంధీ ప్రభుత్వంపై మనోజ్ కుమార్ కేసు ఎందుకు వేశారు?
X

దిగ్గజ నటుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. ఆయన తన సినిమాలతో, నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. మనోజ్ కుమార్ తన సినిమాల ద్వారా దేశభక్తిని, సామాజిక సందేశాలను అందించారు. ఆయన మరణంతో హిందీ చిత్రపరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. కానీ ఆయన సినిమాల ద్వారా ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడు ఉండిపోతారు. బాలీవుడ్ లో మనోజ్ కుమార్ సాహసోపేతమైన వైఖరి గురించి అనేక కథలు వినిపిస్తాయి. కానీ ఇందిరా గాంధీతో ముడిపడిన ఒక కథ మాత్రం చాలా ప్రత్యేకం. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని మనోజ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించిన కాలం నాటిది ఆ కథ.

ప్రారంభంలో ఇందిరా గాంధీ, మనోజ్ కుమార్ మధ్య అంతా బాగానే ఉండేది. అయితే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ సమయంలో ఎమర్జెన్సీని వ్యతిరేకించిన సినీ నటుల సినిమాలపై నిషేధం విధించారు. మనోజ్ కుమార్ కూడా ఎమర్జెన్సీని బహిరంగంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన సినిమాలపై కూడా నిషేధం విధించడం ప్రారంభించారు. మనోజ్ కుమార్ 'దస్ నంబరీ' సినిమా విడుదలైన వెంటనే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఆ తర్వాత 'షోర్' సినిమా విడుదలైనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

'షోర్' సినిమాకు మనోజ్ కుమార్ దర్శకుడు, నిర్మాత కూడా. దీంతో థియేటర్లలో నిషేధం విధించిన తర్వాత సినిమాను వెంటనే దూరదర్శన్‌లో విడుదల చేశారు. దీనివల్ల ఆదాయం రాలేదు. దీంతో మనోజ్ కుమార్ కు కోర్టుకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేకపోయింది. ఆయన కోర్టును ఆశ్రయించి వారాల తరబడి కోర్టు చుట్టూ తిరిగారు. చివరికి మనోజ్ కుమార్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వంపై కేసు గెలిచిన ఏకైక నటుడు ఆయనే. ఆ తర్వాత ప్రభుత్వం ఎమర్జెన్సీపై సినిమా తీయాలని మనోజ్ కుమార్ ను కోరింది. కానీ ఆయన ఆ ఆఫర్ ను తిరస్కరించారు.

ఎమర్జెన్సీపై రూపొందించే డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించాలని సమాచార, ప్రసార శాఖ నుంచి మనోజ్ కుమార్ కు ఫోన్ వచ్చినప్పుడు ఆయన నిరాకరించారు. ఆ డాక్యుమెంటరీ స్క్రిప్ట్ ను అప్పటి ప్రముఖ రచయిత్రి అమృతా ప్రీతమ్ రాస్తున్నారని తెలిసినప్పుడు ఆయన కోపంతో అమృతా ప్రీతమ్ కు ఫోన్ చేశారు. "మీరు అమ్ముడుపోయారా?" అని సూటిగా ప్రశ్నించారు. మనోజ్ కుమార్ అలా మాట్లాడడంతో అమృతా ప్రీతమ్ కూడా బాధపడ్డారు. ఆ డాక్యుమెంటరీ స్క్రిప్ట్ ను చించివేయాలని అమృతా ప్రీతమ్ కు మనోజ్ కుమార్ చెప్పారని కూడా చెబుతారు.