Begin typing your search above and press return to search.

మంజుమ్మల్ బాయ్స్ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ప్రేమలు కంటే 3 రెట్లు ఎక్కువగా

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   7 April 2024 7:55 AM GMT
మంజుమ్మల్ బాయ్స్ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ప్రేమలు కంటే 3 రెట్లు ఎక్కువగా
X

ఏదైనా సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వాలి అంటే స్టార్ నటీనటులు ఉంటే సరిపోదు.. ఆడియన్స్ లో మంచి ఆసక్తి రేకెత్తించే కథ ఉండాలి.. అప్పుడే ఆ మూవీ సూపర్ హిట్ అవుతుంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది మంజుమ్మల్ బాయ్స్ మూవీ. ఈ మలయాళం సర్వైకల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మామూలు సంచలనం సృష్టించడం లేదు. రూ.200 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి దూసుకుపోతోంది. ఇప్పుడు తెలుగులో కూడా దుమ్ముదులుపుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న కథలకు మైత్రి వారు ఈమధ్య మంచి బూస్ట్ ఇస్తున్నారు. మంజుమ్మల్ బాయ్స్ ను కూడా పర్ఫెక్ట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. తొలి రోజు అనేక చోట్ల థియేటర్లు ఫుల్ అయినట్లు ఫోటోలతో సహా మైత్రీ సంస్థ పోస్ట్ చేసింది.

చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుని.. పాజిటివ్ టాక్‌ తో దూసుకుపోతోంది. పాజిటివ్ మౌత్ టాక్ తో థియేటర్లకు ఆడియన్స్ ను రప్పిస్తోంది. తాజాగా మంజుమ్మల్ బాయ్స్ సినిమా అరుదైన రికార్డు సృష్టించింది. తెలుగులో మొదటి రోజు అత్యధిక టికెట్లు అమ్ముడైన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది.

ఇటీవల విడుదలైన ప్రేమలు తెలుగులో అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన మలయాళం డబ్బింగ్ సినిమాగా రికార్డు అందుకోగా ఇప్పుడు ఆ రికార్డును మంజుమ్మల్ బాయ్స్ జెట్ స్పీడ్ లో బ్రేక్ చేసేసింది. ప్రేమలు సినిమాకు తెలుగులో ఫస్ట్ డే 10 వేల రేంజ్ లో టిక్కెట్లు అమ్ముడవ్వగా మంజుమ్మల్ బాయ్స్ సినిమాకు అంతకంటే మూడు రెట్లు ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ప్రముఖ టికెట్ సెల్లింగ్ పోర్టల్ బుక్ మై షో లెక్కల ప్రకారం ఫస్ట్ డే ఈ సినిమాకు 34 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఫస్ట్ డే కన్నా రెండో రోజు బుకింగ్స్ ఇంకా పెరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం దాదాపు అన్ని షోల టిక్కెట్లు అమ్ముడుపోయాయని సమాచారం.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే సాలిడ్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. రూ.3.5 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రెండో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడంతో థియేట్రికల్ రన్ గ్రాండ్‌ గా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

క‌థేంటంటే?

కేర‌ళ‌ కొచ్చికి చెందిన కొందరు స్నేహితులు చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. వీరంతా క‌లిసి కొడైకెనాల్ ట్రిప్‌ కు వెళ్తారు. ట్రిప్ చివర్లో గుణ కేవ్స్ వద్దకు చేరుకుంటారు. లోపలికి వెళ్లడానికి నిషేధం ఉన్నా.. అధికారుల కళ్లుగప్పి వీరంతా వెళ్తారు. అక్క‌డ స‌ర‌దాగా గ‌డుపుతుండ‌గా అనుకోకుండా ఒక స్నేహితుడు లోయలో పడిపోతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? అతడిని కాపాడడానికి వారంతా ఏం చేశారు? ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డాడా లేదా? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.