మంచు విష్ణు కోల్పోయిన ఆవేశం ఎటు వెళ్తుందో..?
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 17 Jun 2025 4:18 AMమంచు విష్ణు 'కన్నప్ప' సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. అందుకు గాను మంచు విష్ణు ఇతర యూనిట్ సభ్యులు చిత్రాన్ని దేశ వ్యాప్తంగా తిరిగి ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల కేరళలో భారీ రిలీజ్ కోసం కొచ్చిలో భారీ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో అక్కడి ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి నెలకొన్నాయి. కన్నప్ప సినిమా గురించి మంచు విష్ణు మలయాళ ప్రేక్షకుల ముందుకు ప్రముఖంగా తీసుకు వెళ్లేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన మలయాళ మీడియాతో ముచ్చటించారు.
కన్నప్ప సినిమా ప్రమోషన్లో భాగంగా మంచు విష్ణు మలయాళ మీడియాతో మాట్లాడుతూ... తనకు మలయాళ సినిమాలపై ఉన్న ఇష్టంను చెప్పుకొచ్చాడు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఏ ఒక్క సినిమాను మిస్ కాలేదు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు ఆధరిస్తారు. అందుకే మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వరుసగా కంటెంట్ ఓరియంట్ సినిమాలు వస్తున్నాయనే అభిప్రాయంను వ్యక్తం చేశాడు. తనకు మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ అంటే చాలా ఇష్టం అన్నాడు. అంతే కాకుండా ఆయనపై అభిమానం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుందని పేర్కొన్నాడు. అతడు నటించిన ట్రాన్స్ సినిమా తనపై బలమైన ముద్ర వేసిందన్నాడు. ఆ సినిమాలో ఫహద్ నటన చూసి నిజంగా ఆశ్చర్య పోయానన్నాడు.
ఫహద్ నటించిన ఆవేశం సినిమా కూడా తనకు చాలా ఇష్టం అన్నాడు. ముందుగా ఆవేశం సినిమాను నేను రీమేక్ చేయాలని అనుకున్నాను. ఆవేశం సినిమాలో ఫహద్ నటన చాలా ఆకట్టుకుంది. అంతే కాకుండా ఆ కాన్సెప్ట్ నన్ను ఎంతగానో ఆకర్షించింది. అందుకే ఆవేశం ను రీమేక్ చేయాలి అనిపించింది. కానీ అప్పటికే ఆ సినిమా రీమేక్ రైట్స్ మరొకరు తీసున్నారని తెలిసింది. ఆవేశం వంటి ఒక విభిన్నమైన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని భావించిన తనకు నిరాశ మిగిలిందని మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. మంచు విష్ణు మిస్ చేసుకున్న ఆ ఆవేశంను ఎవరు చేస్తారు, ఎప్పటికి అది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది చూడాలి.
తెలుగులో ఇప్పటికే చాలా మంది ఆవేశం సినిమా డబ్బింగ్ వర్షన్ లేదా ఒరిజినల్ భాషలో చూశారు. అయినా కూడా రీమేక్ చేయాలనే ఆలోచన చేయడం అనేది కచ్చితంగా సాహసం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ మధ్య నందమూరి బాలకృష్ణ హీరోగా ఆవేశం సినిమాను రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. బాలకృష్ణ పేరు మాత్రమే కాకుండా రవితేజ పేరు సైతం ఈ రీమేక్కి ప్రముఖంగా వినిపించింది. ఇటీవల ఈ రీమేక్ గురించి పెద్దగా హడావిడి లేదు. కానీ మంచు విష్ణు తన తాజా ఇంటర్వ్యూలో ఆ సినిమాకు సంబంధించిన రీమేక్ విషయాన్ని ప్రస్థావించడంతో మళ్లీ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఒకవేళ ఆ నిర్మాతలు మంచు విష్ణుతో రీమేక్ కు సిద్ధం అవుతారేమో చూడాలి.
కన్నప్ప సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న మంచు విష్ణు ఇటీవల విడుదల చేసిన ట్రైలర్తో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాడు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను అంతా కలిగి ఉన్నారు. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ట్రైలర్కి అన్ని భాషల్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మరి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేనా చూడాలి.