నాకు ఫ్యాన్ బేస్ లేదు-మంచు విష్ణు
క తన అభిమానుల గురించి మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు ఫ్యాన్ బేస్ అంటూ ఏమీ లేదని.. నిజాయితీగా ఈ మాట చెబుతున్నానని విష్ణు వ్యాఖ్యానించడం విశేషం.
By: Tupaki Desk | 12 Jun 2025 1:00 PMకాస్త ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా తనకు ఫ్యాన్ బేస్ లేదు అని స్టేట్మెంట్ ఇచ్చే సాహసం చేయడు. కానీ మంచు విష్ణు ఈ స్టేట్మెంట్తో పెద్ద షాకే ఇచ్చాడు. తన కొత్త చిత్రం ‘కన్నప్ప’ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విష్ణు ఈ మాటే అన్నాడు. ఫ్యాన్స్ వల్ల సినిమాల రేంజ్ పెరుగుతుంది కదా అనే వాదనపై విష్ణు స్పందిస్తూ.. ఒకప్పుడు ఇలా జరిగేదేమో కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తేల్చేశాడు. ఫ్యాన్స్ వల్ల సినిమాలు ఆడడం, రేంజ్ పెరగడం ఈ రోజుల్లో జరగట్లేదని.. ఇక ముందు అసలే ఉండకపోవచ్చని విష్ణు అభిప్రాయపడ్డాడు.
ఇక తన అభిమానుల గురించి మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు ఫ్యాన్ బేస్ అంటూ ఏమీ లేదని.. నిజాయితీగా ఈ మాట చెబుతున్నానని విష్ణు వ్యాఖ్యానించడం విశేషం. తనకు ఒకప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని.. దాన్ని పోగొట్టుకున్నానని విష్ణు చెప్పాడు. ఓటీటీల ప్రభావం పెరిగి.. యూట్యూబ్ విస్తృతమైన నేపథ్యంలో ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావడం చాలా కష్టమైపోతోందని.. ఫ్యాన్స్ కూడా వచ్చి సినిమాలు చూడడం తగ్గించేశారని మంచు విష్ణు అన్నాడు.
తాము యూట్యూబ్లో చూసే కంటెంట్ను మించి పెద్దగా ఏదైనా చూపిస్తేనే థియేటర్లకు రావాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటోందని విష్ణు అన్నాడు. ఇక ‘కన్నప్ప’ బడ్జెట్ గురించి మాట్లాడుతూ... అది ట్రిపుల్ ఫిగర్స్లో ఉంటుందని.. బడ్జెట్ ఎంత అన్నది ప్రకటిస్తే మళ్లీ ఐటీ అధికారులు తమ ఇంటి తలుపు తడతారని విష్ణు అన్నాడు. వేరే సినిమాల బడ్జెట్లతో పోలుస్తూ.. ‘ఓజీ’ కంటే ఎక్కువ, ‘రాజా సాబ్’ కంటే తక్కువ అని విష్ణు పేర్కొన్నాడు. అతడి మాటలను బట్టి చూస్తుంటే ‘కన్నప్ప’ బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అని అర్థమవుతోంది.